బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి
యూత్ డిక్లరేషన్ హమీలన్నింటిని అమలు చేయాలి
– డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటి
హైదరాబాద్, ఫిబ్రవరి 23, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే వార్షిక బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని, యూత్ డిక్లరేషన్ హమీలను అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతికై నిధులు కేటాయించాలని, రాజీవ్ యువ వికాస్ పథకం అమలుకై నిధులు కేటాయించాలని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సోమవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీనిచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా నిరుద్యోగ భృతి గురించి ఊసేత్తడం లేదని అన్నారు. రాబోవు వార్షిక బడ్జెట్లో నిరుద్యోగ భృతి కి నిధులు కేటాయించాలని, యువతకు ఉపాధి అవకాశాలకు 1000 కోట్ల రూపాయలతో యూత్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియమాక నోటిఫికేషన్స్, పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా గత సంవత్సరం ఫిబ్రవరిలో జాబ్ క్యాలండర్ను ప్రకటించినా ఇప్పటి వరకు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా లక్షలాదిమంది నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ నియమకాలను చేపట్టాలన్నారు.
ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి నాలుగువేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు అందించాడానికై రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా రూ.50 వేల నుండి రూ.4 లక్షల వరకు రుణాలను ఇస్తామని 6 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తామని ప్రకటించడంతో ఈ పథకానికి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు 16 లక్షలా 25వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున రాజీవ్ యువ వికాస్ పథకం లబ్దిదారులకు నిధులను మంజూరు చేస్తామని ప్రచారం చేసి వాయిదా వేసిందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా, కాలయాపన చేయకుండా రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన లబ్దిదారుల అందరికి రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిబిల్ స్కోరు లేకున్నా నిరుద్యోగ యువతకు ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రతి గ్రామంలో,మండల నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా మైదానాల ఏర్పాటు కై, క్రీడాకారుల ప్రోత్సాహనికై క్రీడారంగానికి అధిక నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 18 సంవత్సరాలు పైబడిన యువ మహిళలకు అందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వడానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. బడ్జెట్ సమావేశాల్లో యువజన రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులను కేటాయించాలని లేనియెడల డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి, ఎండీ జావీద్, నాయకులు రాజు లు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply