బిసి బంధు ద్వారా బిసిల‌కు 20 లక్షల రూపాయలను మంజూరు చేయాలి

 బిసి బంధు పధకం పెట్టి
ప్రతి బిసి కుటుంబానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయాలి
– రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

హైద‌రాబాద్‌, మే 31, ( అద్దం న్యూస్ ) :   జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిసిలకు ” బిసి బంధు పధకం ” ప్రవేశ పెట్టి ప్రతి బిసి కుటుంబానికి 20 లక్షల రూపాయల ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ విద్యానగర్ బిసి భవన్ లో జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్.ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షతన 14 బిసి సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… గత 13 సంవత్సరాల తెలంగాణ పాలనలో ఒక్క బీసీకి కూడా సబ్సిడీ రుణాలు మంజూరు చేయలేదన్నారు. రెండు సార్లు 2015లో 3 లక్షల 62 వేల దరఖాస్తులు తీసుకున్నారు… కానీ రుణాలు మంజురు చేయలేదన్నారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2022లో మరోసారి సబ్సిడీ రుణాలు ఇస్తామని 5 లక్షల 77 వేల దరఖాస్తులు తీసుకున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2024 లో మరోసారి 6 లక్షల 80 వేల దరఖాస్తు తీసుకున్నారు.. కానీ రుణాలు మంజూరు చేయలేదని విమర్శించారు. బిసి కులాల అభివృద్ధికి కూడా ప్రతి బిసి కుటుంబానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ బిసి ” బంధు పథకం ” ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకత ఉందన్నారు. బీసీ కులాలలో చాలా కులాలు అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయని.. స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు గడిచిన వీరి కుల వృత్తులు దెబ్బ తిన్నాయన్నారు.

బిసి కుల వృత్తులు యంత్రికరణలో దెబ్బతిన్నాయి. ప్రత్యామ్నాయంగా వీరికి కుటీర పరిశ్రమలు చిన్న తరహ పరిశ్రమలు పెట్టి ప్రోత్సహించాలి. వృత్తులు కోల్పోతున్న ఈ కులాలకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. గత 13 సంవత్సరాలు తెలంగాణ పాలనాలో బీసీలకు ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఎలాంటి స్క్రీములు ప్రవేశపెట్టలేదని పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో విద్యార్ధుల డిమాండ్ పెద్ద ఎత్తున ఉన్నందున అదనంగా 120 బిసి గురుకుల పాఠశాలలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బిసి స్టడీ సర్కిల్ కు 200 కోట్లు కేటాయించాలని, కోచింగ్ పద్దతులు మార్చాలన్నారు. అర్హులందరికీ డిఎస్సీ, పోలీస్, ఎస్ఐ, గ్రూప్-1, 2, 3, 4 సివిల్స్, బ్యాంకింగ్, రైల్వే ఇతర పోటీ పరిక్షలకు కోచింగ్ ఇవ్వాలన్నారు. కులాంతర వివాహాలు చేసుకొనే బిసి కులాల వారికి ప్రోత్సాహక పారితోషికం 2 లక్షల 50 వేలకు పెంచాలని, ఎస్సార్, ఎస్టీలకు పెంచారు… కానీ బిసిలకు పెంచలేదన్నారు. బిసి కార్పొరేషన్ కు సబ్సిడీ రుణాల కోసం రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ఎంబిసి కార్పొరేషన్ కు 2 వేల కోట్లు కేటాయించాలని, 12 బిసి కులాల ఫెడరేషన్లకు జనాభా నిష్పత్తిలో 2 వేల కోట్లు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిసి నిరుద్యోగ జెఎసి చైర్మన్ నీల వెంకటేష్, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొల్ల మోదీ రాందేవ్, బిసి సంక్షేమ సంఘం జాతీయ క‌న్వీన‌ర్ రాజేందర్, అనంతయ్య, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ళ సతీష్, అంజి గౌడ్, బాలయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page