తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆ రంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే వ్యవస్థలో అవసరమైన ప్రక్షాళన చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. విద్యా రంగంపై శాసనమండలిలో బుధవారం జరిగిన ప్రత్యేక చర్చకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమాధానమిచ్చారు. 2021 నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో పేర్కొన్న గణాంకాలను సభలో వివరించారు. సబ్జెక్టుల వారిగా తెలంగాణలో ఏ స్థానానికి పడిపోయిందనేది తెలిపారు. ఏ సబ్జెక్టులోనూ కనీస ప్రాథమిక సామర్థ్యాన్ని ప్రదర్శించలేని వారి సంఖ్య పెరగడం, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల సంఖ్య తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. “విద్యా విధానం కొంత ఆందోళనకరంగా మారిందని, ఎవరు అవునన్నా కాదన్నా ఇందులో వాస్తవం ఉందన్నారు. విద్యా రంగంలో పడిపోతున్న ప్రమాణాలను పెంచాలంటే కేవలం నిధుల కేటాయింపు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని.. అందరూ ఒక సామాజిక బాధ్యతగా భావించినప్పుడే సమస్యను పరిష్కరించగలుగుతామని సీఎం తెలిపారు. విద్యా రంగంలో ప్రమాణాలు పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీ నిర్వహించి 10 వేల మంది టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను పూర్తి చేశామని స్పష్టం చేశారు. అయితే, విద్యా ప్రమాణాలు పడిపోవడంలో కేవలం ప్రభుత్వానిదే కాకుండా సమాజంపైన కూడా బాధ్యత ఉంది. సామాజిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచాల్సిన అవసరం ఉందని.. రాజకీయ కోణంలో ఆలోచనలు చేసినన్ని రోజులు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయలేమన్నారు.
విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులు, ప్రక్షాళన చేయడానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని, అందరి సూచనలతో సమగ్రమైన ఒక పాలసీ డాక్యుమెంట్ను రూపొందించి చర్చిద్దామన్నారు. పడిపోతున్న ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికీ మేల్కొనకపోతే భవిష్యత్తు తరాలకు మనం ద్రోహం చేసిన వారిమవుతామని… ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ ప్రక్షాళన చేయలేమని సీఎం అభిప్రాయపడ్డారు. యువతలో నైపుణ్యం కొరవడి వెనుకబడిపోతున్నారన్నారు. నైపుణ్యతలను పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (#YISU) ని ఏర్పాటు చేశామన్నారు. అలాగే, మూస పద్ధతిలో సాగుతున్న ఐటీఐలను సంస్కరిస్తూ కాలం చెల్లిన కోర్సులకు స్వస్తి పలుకుతూ వాటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (#ATC) అప్గ్రేడ్ చేస్తున్నామని.. వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. క్రీడాకారులను తయారు చేయడం, ఒలింపిక్స్ క్రీడలు లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీలను ప్రారంభించబోతున్నామని.. దీనికి సంబంధించి త్వరలోనే విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం” అని వివరించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply