ఐఎన్టియూసి ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు
హైదరాబాద్, జూలై 30, ( అద్దం న్యూస్ ) : కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అత్యధిక జనాభాకు పౌర, అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీలో రెండు రోజులుగా బోనాల సందడి నెలకొంది. మొదటి రోజైన మంగళవారం ప్రధాన కార్యాలయంలోని అమ్మవారి దేవాస్థానం కమిటీ బోనాల ఉత్సవాలను సాంప్రదాయంగా నిర్వహించగా, ఐఎన్టియూసి గుర్తింపు పొందిన మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సుమారు వెయ్యి మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికులు, భక్తులు హాజరైన ఈ ఉత్సవాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వి.హన్మంతరావు, ఐఎన్టియూసి ఆలిండియా అధ్యక్షుడు, మాజీ ఎంపీ జి.సంజీవరెడ్డి కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపుగా దేవాలయంలోని అమ్మవారికి సాంప్రదాయబద్దంగా బోనం సమర్పించారు.
ఈ సందర్భంగా వి.హన్మంతరావు మాట్లాడుతూ… ఆషాడ మాసంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే బోనాల పండుగ మన సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. మాజీ ఎంపీ సంజీవరెడ్డి మాట్లాడుతూ… ఐఎన్ టీయూసీ గుర్తింపు పొందిన మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయటంతో పాటు కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల పండుగలను నిర్వహిస్తూ మతసామరస్యాన్ని చాటుకుంటుందన్నారు. అనంతరం యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ మాట్లాడుతూ… ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తే అమ్మవారు రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతారని వివరించారు. జీహెచ్ఎంసీలో గుర్తింపు యూనియన్ లేక ఉద్యోగులు, కార్మికులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారని, సర్కారు సానుకూలంగా స్పందించి వెంటనే యూనియన్ల గుర్తింపు ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఐఎన్టియూసి జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ బాబర్ సలీం బాషా, ఐఎన్టియూసి సీనియర్ లీడర్ విజయ్ కుమార్ యాదవ్, యూనియన్ ఉమెన్ కమిటీ చైర్ పర్సన్ ఎల్.మెర్సీ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply