బస్సు చార్జీలను పెంచి ప్రజలకు దసరా బహుమతి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా

హైదరాబాద్, అక్టోబర్ 5, అద్దం న్యూస్ : బస్సు చార్జీలను పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు దసరా బహుమతి ఇచ్చిందని తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. ఆదివారం హైదరాబాద్ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో తిరిగే సిటీ బస్సుల టికెట్ల ధరలు ఒక్కో స్టేజీకి రూ.5 నుంచి రూ.10 ల వరకు పెంచి ఇది అన్ని ఆర్డినరీ, మెట్రో సహా అన్నిబస్సులకు వర్తిస్తుందని, సోమవారం నుంచే కొత్త చార్జీలు అమలులోకి వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం టీజిఎస్ ఆర్టీసి ప్రకటించిందన్నారు. దీంతో ఇకపై ఆర్డినరీలో సైతం కనీస టికెట్ ధర రూ.15 లుగా ఉండనుందని అన్నారు. బస్సు రూట్లోని స్టేజీల వారీగా రూ.5 నుంచి రూ.10 వరకు టికెట్ ధరను పెంచి ప్రయాణికుల నుంచి వసూలు చేయనుందని, ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో కనీస టికెట్ ధర రూ.15 కు పెరిగిందన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమయ్యే నిధుల కోసం సిటీ బస్సుల్లో చార్జీల పెంపునకు అనుమతినివ్వాలని టీజిఎస్ ఆర్టీసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించి సామాన్యుడి నడ్డి విరిచిందని ధ్వజమెత్తారు.
చార్జీల పెంపుతో బస్ పాసులు, డే పాస్లతో ప్రయాణాలు చేసే విద్యార్థులపై, ఒక్కో ప్రయాణికుడిపై నెలకు రూ.300 నుండి 500 వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని, చార్జీల పెంపుతో ప్రయాణికుల తీవ్ర విమర్శలు వస్తున్నాయన్నారు. ఇప్పటికే అధిక ధరల వల్ల నలిగి పోతున్న ప్రజలు, ప్రజారవాణా సౌకర్యాలలేమితో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న సందర్బంలో గోరు చుట్టుపై రోకలి పోటు చందంగా ప్రజా ధనం దోపిడికి పాల్పడడం మంచిది కాదని, ప్రజల నుండి తిరుగుబాటు ఎదుర్కునే పరిస్థితి త్వరలో రాబోతుందని హెచ్చరించారు. కాబట్టి వెంటనే పెంచిన బస్సు చార్జీల ధరలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply