స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని జయశంకర్ సార్ నమ్మేవారు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ బ్యూరో, ఆగస్టు 6, ( అద్దం న్యూస్ ) : స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని జయశంకర్ సార్ నమ్మేవారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… మనకు జయశంకర్ సార్ గురువు అయితే.. రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు అని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మాటే వేదంగా భావిస్తూ, తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టాడని విమర్శించారు. ఇలాంటి సన్నాసులకు జయశంకర్ సార్ ట్యూషన్ చెప్తే.. కనీసం సిగ్గు తెచ్చుకుంటుండే అని అన్నారు. కనీసం జై తెలంగాణ అని చెప్పడానికి కూడా రేవంత్ రెడ్డికి మనసొప్పదన్నారు. ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి తెలంగాణలో ఉండడం బాధాకరమన్నారు. సామంతరాజు లాగా రేవంత్ రెడ్డి 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి పోయిండని, ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతోందన్నారు. లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ తెలంగాణను పాకిస్తాన్ వేర్పాటుతో పోలిస్తే, ఒక్కడన్న మాట్లాడిండా ? అని ధ్వజమెత్తారు. అదే అక్కడ గులాబీ జెండా కప్పుకున్న బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఉంటే గల్లా పట్టి అడిగేవారు కదా అని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూధనాచారి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సురభి వాణీదేవి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతా, గండ్ర వెంకటరమణ, బానోత్ శంకర్ నాయక్, కోరుకంటి చందర్, మెతుకు ఆనంద్, బిగాల గణేష్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా, బీఆర్ఎస్ నాయకులు రాగిడి లక్ష్మా రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.












Leave a Reply