కాంగ్రెస్ పార్టీ సమరభేరి కాదు… అధికార దుర్వినియోగ భేరి
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ సాయిబాబా

హైదరాబాద్, జులై 5, అద్దం న్యూస్ : కోట్ల కొద్ది ప్రజాధనం దుర్వినియోగం చేసి సామాజిక సమరభేరి అంటూ నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ సామాజిక సమరభేరి కాదని.. ప్రజాధనం, అధికార దుర్వినియోగ భేరి అని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ పి.సాయిబాబా విమర్శించారు. శనివారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… గ్రామాల నుండి పెద్ద ఎత్తున జన సమీకరణ కొరకు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారని విమర్శించారు. ఎంతసేపు తమ పదవులను కాపాడు కోవడానికే ఢిల్లీ పెద్దల అడుగులకు మడుగు లొత్తడానికే, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని అడుగడుగునా తాకట్టు పెడుతున్నా రాష్ట్రంలోని ఇతర పార్టీలు స్పందించక పోవడం దురదృష్టకరమన్నారు. ఈ సామాజిక సమరభేరి సభలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగులో మాట్లడకుండా హిందీలో ప్రసగించడం తెలుగుబాషపై కాంగ్రెస్ పాలకుల చిన్నచూపును, గౌరవాన్ని తెలియజేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడుస్తున్నా సాధించిన ప్రగతి ఏమిటంటే… పథకాల పేర్ల మార్పు, విగ్రహాలు పెట్టడం తప్ప సాధించింది ఏమీ లేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఆడపిల్ల పుడితే తల్లికి వందనం, గ్యాస్ సబ్సిడీని ముచ్చటగా 3 నెలలిచ్చి ఎత్తేసారని అన్నారు. జాబ్ క్యాలెండర్ వంటి వాగ్దానాలను తుంగలో తొక్కి ప్రజా వంచనకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని, చీటికి మాటికి “ఆడ లేక మద్దెల ఓడు” అన్నచందంగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నంగా, అధికార కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై కుట్రలతో తమ చేతగాని తనాన్ని ఒప్పుకోలేక ప్రత్యక్షంగా లేక పరోక్షంగా బురద జల్లడం మంచిది కాదన్నారు. రేపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తిరిగి పునర్వైభవం పొందితే తమ పార్టీల మనుగడ గల్లంతవుతుందనే భయంతో అవాక్కులు చవాక్కుసు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మరోసారి చంద్రబాబు పేరు ఎత్తితే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఎన్నికల ముందు మీరిచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి అతిగతే లేదని… ప్రలోభాలతో వచ్చిన జనాన్నిచూసి, వాపును చూసి బలుపు అనుకోవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదేనని 15 ఎంపీ స్థానాలు గెలుస్తామని పగటి కలలు కనడం, ప్రగల్బాలు పలకడం మానుకొని ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల అమలుకు కృషి చేస్తే ప్రజలు సంతోషిస్తారని, మీకూ భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రజలు మర్చి పోయారని అనుకోవద్దని, బాధ్యత గల వ్యక్తులు ప్రజాస్వామ్యానికి కట్టుబడి మాట్లాడాలని, పరుష పదజాలాన్ని పక్కన పెట్టి హుందాగా వ్యవహరించాలని కోరారు. లేదంటే ప్రజల్లో రాజకీయాల పట్ల జుగుప్సాకర భావం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. మీరు ఎంతగా చంద్రబాబుపై దుమ్మెత్తి పోసినా తెలంగాణలో తెలుగుదేశం పాగా వేయడం కచ్చితంగా జరుగుతుందని, కాబట్టి ఇకనైనా ప్రజల సంక్షేమం, అభివృద్దిపై దృష్టి పెట్టి పాలన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, తడక వినోద్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply