హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : పెంచిన బస్ పాస్ ధరలను వెనక్కి తీసుకుని, విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలని పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బస్ పాస్ చార్జీల పెంపు నిర్ణయం ద్వారా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తనున్నాయన్నారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు, కళాశాలలు రీ ఓపెన్ అవుతున్న సందర్భంగా బస్ పాస్ చార్జీలు పెంచి విద్యార్థులను ఈ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో నగరంలో విద్యార్థులకు సాధారణ నెల పాస్ రూ.400 రూపాయలు ఉంటే దానిని రూ.600 రూపాయలుగా పెంచారన్నారు. మూడు నెలల పాస్ రూ.1200 ల నుండి రూ.1800 రూపాయలకు పెంచడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 లక్షల విద్యార్థులపై అదనపు భారాన్ని మోపడమే అవుతుందన్నారు. నగరాలలో ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తలెత్తుతున్న ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. బస్సులను పెంచమంటే బస్ చార్జీలు పెంచడం ప్రభుత్వ నీతిమాలిన చర్య అని అన్నారు. పెంచిన అన్ని రకాల చార్జీలను వెంటనే తగ్గించాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి ఉచిత బస్ ప్రయాణం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply