గ‌ణేష్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నంలో అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు లేకుండా కొన‌సాగుతుంది – హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి ఆనంద్

గ‌ణేష్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నంలో అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు లేకుండా కొన‌సాగుతుంది

– హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి ఆనంద్


హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 06, అద్దం న్యూస్ :      గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కొనసాగుతోందని హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి ఆనంద్ తెలిపారు. శ‌నివారం సాయంత్రం మీడియాతో క‌మిష‌న‌ర్ సివి.ఆనంద్ మాట్లాడుతూ… నిమజ్జన ప్రక్రియలో పురోగతిని, పోలీసులు తీసుకున్న చర్యలను వివరించారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం మధ్యాహ్నం 1:05 గంటలకు, బాలాపూర్ గణపతి నిమజ్జనం సాయంత్రం 6:11 గంటలకు పూర్తయ్యాయన్నారు. ఇప్పటి వరకు 650 కి పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తయింది అని తెలిపారు. నగరంలో ఇంకా సుమారు 4,500 విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉందన్నారు. సౌత్ జోన్ ( ఛత్రినాక, చాంద్రాయణగుట్ట, రాచకొండ ) సైబరాబాద్ వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఇంకా రోడ్లపై ఉన్నాయని ఏరియల్ సర్వే ద్వారా గుర్తించామని తెలిపారు. నాలుగు వరుసల్లో విగ్రహాల శోభాయాత్రను కొనసాగించి నిమజ్జనం వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈసారి గణేశ్ నిమజ్జనానికి సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకున్నామన్నారు. విగ్రహాల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరిచారని… గణేశ్ విగ్రహాలను జియో-ట్యాగింగ్ చేశామని.. దీనివల్ల ప్రక్రియ సులభమైందని తెలిపారు. టిఎస్ కాప్ ( TS COP ) యాప్లో గణపతి నిమజ్జనం కోసం ప్రత్యేక ఆప్షన్‌ను ప్రవేశపెట్టారన్నారు. దీని వల్ల ఇన్‌స్పెక్టర్ స్థాయిలో కూడా తమ పరిధిలోని విగ్రహాల కదలికలను ట్రాక్ చేయగలుగుతున్నారని తెలిపారు. మండపాల నిర్వాహకులు ఇచ్చిన సమాచారం ప్రకారం, డీజే, బ్యాండ్ వంటివి లేకుండా చూసి వాహనాలను అనుమతిస్తున్నామని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి తీసుకున్న చర్యల వల్ల 10 శాతం సీసీటీవీ కెమెరాల కనెక్షన్లు తెగిపోయినాయ‌ని, వీటిలో 3 శాతము వరకు నిమజ్జము కోసము రిపేరు చేయగలిగార‌ని, నిఘా కోసం డ్రోన్లు ( 9 ), హై-రైజ్ కెమెరాలను ( 35 ) ఉపయోగిస్తున్నామన్నారు. నిమజ్జనం వేగవంతం చేయడానికి పుషింగ్ పార్టీలను ఏర్పాటు చేశామని తెలిపారు. హుస్సేన్ సాగర్ వద్ద 40 క్రేన్‌లు నిమజ్జనం కోసం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తున్నామ‌న్నారు.

పోలీసుల సూచనలను మండప నిర్వాహకులు మాతో సహకరిస్తూ సూచనలు పాటిస్తున్నారని, రేపు ఉదయం 8 గంటలలోపు విగ్రహాల నిమజ్జనాలు పూర్తవుతాయని ఆశిస్తున్నామని తెలిపారు, రేపు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ సడలింపు ఉంటుందని కమిషనర్ ఆనంద్‌ తెలిపారు. సౌత్ జోన్, ఈస్ట్ జోన్‌లోని పెండింగ్ విగ్రహాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని వెల్లడించారు. కమాండ్ ఆండ్ కంట్రోల్ రూము ద్వారా అన్ని శాఖల అధికారులతో పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఎప్పటి కప్పుడు సూచనలు జారీ చేస్తున్నామని కమిషనర్ ఆనంద్‌ తెలిపారు. ఈ కార్యక్రమములో టిజిఐసిసిసి డైరెక్టర్ విబి.కమలాసన్ రెడ్డి, టిజిఐసిసి డిసిపి పుష్ప, ఇతర శాఖల అధికారులు పాల్గోన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page