ఎస్‌పి.బాలసుబ్రహ్మణ్యం విగ్ర‌హం ఏర్పాటును అడ్డుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా 

ఎస్‌పి.బాలసుబ్రహ్మణ్యం విగ్ర‌హం ఏర్పాటును అడ్డుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రం
– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా 

హైదరాబాద్, డిసెంబ‌ర్ 4, అద్దం న్యూస్ :        దివంగ‌త సినీ గాయ‌కుడు ఎస్‌పి.బాలసుబ్రహ్మణ్యం విగ్రహ వివాదంపై తెలంగాణ వాదుల సంకుచితత్వం – తెలుగు జాతికి పెను గాయం అని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. గురువారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ప్రముఖ గాయకులు ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం ( ఎస్పీబీ ) విగ్రహ స్థాపనపై జరుగుతున్న వివాదాన్ని, దీనికి కారణమైన ‘ కుహానా తెలంగాణ వాదుల ‘ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. ఎస్‌పి.బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వద్ద పెట్టొద్దని అనే సంకుచిత భావాలతో ఉండ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. కళ, కళాకారుడు ఎక్కడ ఉన్నా దైవంతో సమానం అని, తన కళను ప్రజలకు పంచే స్వేచ్ఛ‌ కళాకారుడికి ఉంటుందని సాయిబాబా అన్నారు. ‘ ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ వ్యక్తి కాదు, ఆయన విగ్రహం హైదరాబాద్‌లో పెట్టకూడదు ‘ అనే మాటలు, ఆలోచనలు అసహ్యకరమైనవి, తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు ఇంతకన్నా అవమానకరమైనది మరొకటి ఉండదన్నారు.

                                 సంగీతానికి, కళలకు ‘ ప్రాంతీయత మకిలి ‘ పులమడం బుద్ధి, సిగ్గు, కృతజ్ఞత లేకపోవడమే అవుతుంద‌న్నారు. గత ఆరు దశాబ్దాలుగా ఎస్పీబీ పాటను తెలంగాణ ప్రజలు వింటూ, తన్మయులవుతున్నది అబద్ధం అవుతుందా ? ప్రాంతీయత పేరుతో ఒక ప్రాంత ప్రజల్ని అలరించిన గాయకుడి విగ్రహం ఆ ప్రాంతంలో ఉండకూడదా అని ఆయన ప్రశ్నించారు. ఎస్పీబీ తెలుగు వ్యక్తి అయినప్పటికీ, తమిళనాడులోని చెన్నైలో ఆయన పేరుతో ఒక వీధి, కోయంబత్తూరులో ‘ ఎస్పీబీ వనం ‘ పేరుతో ఒక పార్కు ఉన్న విషయాన్ని సాయిబాబా గుర్తు చేశారు. తమిళ భాషీయులు, కన్నడిగులు బాలును ప్రాంతీయతతో పరిగణించకుండా, తెలుగువారి కంటే ఉన్నతమైన స్థానం ఇచ్చారని పేర్కొంటూ, మన తెలుగు జాతి సిగ్గు, బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.

                  తెలంగాణ, ఆంధ్ర ప్రజలు షియా, సున్నీలు అయిపోయి కొట్టుకుంటూ తెలుగుకే పెను గాయం అవకూడదని ఆయన ఆకాంక్షించారన్నారు. విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్న వారు, ఎస్పీబీ పాటలు వింటున్న తెలంగాణ ప్రజల్ని అడ్డుకోగలరా, వారు పాటలు వినడం ఆపేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం తన కల అని ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్ చారి వర్ధంతిని కూడా పట్టించుకోని ఈ కుహానా మేధావులు, ఏదో ఉద్యమిస్తున్నట్టు పోజులు కొడుతూ, కొంత మంది సంతృప్తి కోసం యాక్షన్ చేయడం విచారకరమ‌న్నారు. కొంత మంది కుహానా వాదుల ప్రకారం తెలంగాణ రజాకార్ల బొమ్మ పెట్టుకుంటే బాగుంటుందా ? అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్, తడక వినోద్, అనిల్ కురుమ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page