
హైదరాబాద్, నవంబర్ 8, అద్దం న్యూస్ : కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ వేడుకకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావలసిన అవసరం ఉందని, కోటి దీపోత్సవ కార్యక్రమానికి జాతీయ స్థాయి గుర్తింపును ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని తెలిపారు. భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టిఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో సతీసమేతంగా సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అక్కడ వేద మంత్రోచ్చారణల మధ్య వైభవోపేతంగా జరిగిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. కోటి లింగేశ్వర స్వామి వారికి శత అష్టోత్తర పంచ మహా హారతులను ఇచ్చారు. స్వర్ణ మహాలక్ష్మి మాత గారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అశేషంగా హాజరైన భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ… గడిచిన 14 సంవత్సరాలుగా ఈ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు తుమ్మల నరేంద్ర చౌదరి దంపతులను, రచన టెలివిజన్ యాజమాన్యం, సిబ్బందికి అభినందనలు తెలిపారు. మొదట హైదరాబాద్లో ప్రారంభమైన ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం దేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాల్లో ఉన్న భక్త కోటికి హరహర మహాదేవుడి నామస్మరణ వినిపిస్తున్నారని, ఇంతటి అద్భుత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేశారు. జన్మదినం రోజున భక్తుల సమక్షంలో గడుపుకోవడం తనకు జీవిత కాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మిగులుతుందని చెబుతూ, ముఖ్యమంత్రి భక్తకోటికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మక కార్యక్రమాల ద్వారా దేశంలోనే అత్యధికంగా వీక్షించే భక్తి చానెల్గా కోట్లాది మంది భక్తుల మన్ననలు పొందడం అభినందనీయమని అన్నారు.


ఎన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొంటే గొప్ప ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుందని, ఆ శక్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించడం, దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కోట్లాది మంది భక్తులు తనకు శక్తిని ఇవ్వాలని కోరారు. వేలాదిగా హాజరైన భక్తుల సమక్షంలో స్వామి అమ్మవారి వాహన సేవను తిలకించారు. రేవంత్ రెడ్డి దంపతులు వైశ్య కుల గురువులు హల్దీపురం పీఠాధిపతి పూజ్యశ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. కాజీపేట శ్వేతార్క మహాగణపతి అనుగ్రహం తీసుకున్నారు. కార్తీక దీపారాధన చేశారు. అనంతరం సప్త హారతిని వీక్షించారు. అంతకుముందు కార్యక్రమం మొదలు కాగానే శ్రీ జగన్నాథమఠం వేదపాఠశాల, సీతారాంబాగ్ వారిచే వేద పఠనం జరిగింది. శ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి చేసిన ప్రవచనాన్ని భక్తులు ఎంతో శ్రద్ధగా విన్నారు. హల్దీపుర మఠం పీఠాధిపతి శ్రీవామనాశ్రమస్వామి అనుగ్రహభాషణం ఆకట్టుకుంది. వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి కల్యాణం ఘనంగా జరిగింది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply