జర్నలిస్టుల పట్ల పాలకుల వివక్షను ప్రతిఘటిద్దాం
– సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
– దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి
– జర్నలిస్టుల సమస్యలపై పోరాడే సంఘం టీడబ్ల్యూజేఎఫ్
🔷వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య
సిద్దిపేట, డిసెంబర్ 28, అద్దం న్యూస్ : జర్నలిస్టుల పట్ల పాలకులు వివక్ష చూపుతున్నారని,ఈ వైఖరిని ఐక్యంగా ప్రతిఘటించాలని తెలంగాణ వర్కిగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నేతాజీ పబ్లిక్ స్కూల్లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మూడో మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడం తగదని అన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోని వచ్చి రెండేండ్లు అవుతున్నా జర్నలిస్టులకు ఇప్పటి వరకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వలేక పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండేండ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్రెడిటేషన్ల జీవో 239కి బదులు ఇటీవల 252 జీవో జారీ చేసిందని, కొత్త రూల్స్ తో జర్నలిస్టులను అయోమయానికి, ఆందోళనకు గురి చేసిందని అన్నారు. తప్పుల తడకగా ఉన్న ఈ జీవోను వెంటనే సవరించాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై చిత్తశుద్దితో పోరాడే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ అని, ఈ సంఘం జర్నలిస్టులకు అండగా ఉంటుందని మామిడి సోమయ్య అన్నారు. సంఘాన్ని బలోపేతం చేసి సమస్యలపై పోరాటానికి సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాసభలో ఫెడరేషన్ రాష్ట్ర కో– కన్వీనర్లు ఆనందం, జగన్, విజయ్ కుమార్, శ్రీనివాస్, బాపురావు, సిద్దిపేట జిల్లా నాయకులు మహిపాల్ రెడ్డి, మురళీధర స్వామి తదితరులు పాల్గొన్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ సిద్దిపేట జిల్లా కమిటీ ఎన్నిక :
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికయింది. జిల్లా అధ్యక్షుడిగా సత్తు మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఆకుల రాజు, ముస్త్యాల యాదగిరి, కార్యదర్శిగా ఖుద్రత్ అలీ, సహాయ కార్యదర్శులుగా కోటేశ్వర రావు, శ్రీనివాస రెడ్డి, కోశాధికారిగా సంపత్, కార్యవర్గ సభ్యులుగా ప్రశాంత్, సతీష్, శ్రీనివాస్, సందీప్, జాతీయ కౌన్సిల్ సభ్యులుగా వరయోగుల మురళీధర్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.![]()


