హైదరాబాద్, జూన్ 15, అద్దం న్యూస్ : జులై 9 న జరగనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ అన్నారు. ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గం గోల్కొండ చౌరస్తాలో గల సిఐటియు నగర కార్యాలయంలో సిఐటియు ముఖ్య కార్యకర్తల శిక్షణ తరగతులు జరిగాయి. ఈ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 9 న జరగనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపు ఇచ్చారు. మోడీ ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి 8 గంటల పని దినం స్థానంలో 12 గంటలు పని దినాన్ని ప్రవేశపెడుతున్నదని విమర్శించారు. కార్మికులను ఎప్పుడంటే అప్పుడు తొలగించుకునే స్వేచ్ఛను యజమానులకు కట్టబెట్టారని అన్నారు. కార్మికులు కనీస వేతనం రూ 26,000/- లు అడుగుతుండగా మోడీ ప్రభుత్వం మాత్రం ఫ్లోర్ లెవెల్ వేజ్ రూ. 178 లుగా నిర్ణయం చేసిందని అన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని అడుగుతుంటే మోడీ ప్రభుత్వం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పద్ధతిని తీసుకువచ్చి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నదని అన్నారు. సిఐటియు నగర కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ… అన్ని విభాగాలలో మహిళలు రాత్రిపూట పని చేసే విధంగా చట్టాలను సవరించారని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్ల వలన పిఎఫ్ చట్టం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రేడ్ యూనియన్లు పెట్టుకునే హక్కును, బేరసారాలు ఆడే హక్కును హరించి వేస్తున్నారని అన్నారు. 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికుల జీవితాలు దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా మారుతాయని అన్నారు. ప్రభుత్వ సంస్థలను అదానీ, అంబానీ వంటి స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు నేషనల్ మానిటైజేషన్ పేరుతో అమ్మేస్తున్నారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతాంగాన్ని మోసం చేస్తున్నదని అన్నారు. జూలై 9న జరగనున్న దేశ వ్యాప్త సమ్మెను హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్త కార్మిక వర్గం ఆ రోజు పని బంద్ చేసి జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ శిక్షణ తరగతులకు సిఐటియు నగర ఉపాధ్యక్షుడు మల్లేష్ ప్రిన్సిపల్ గా వ్యవహరించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
