హైదరాబాద్, జూన్ 25, అద్దం న్యూస్ : బిసి రిజర్వేషన్ల పేరుతో ఎమ్మెల్సి కవిత కొత్త నాటకానికి తెరలేపిందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా అన్నారు. బుధవారం హైదరాబాద్ టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… బిఆర్ఎస్ మహిళా నాయకురాలు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల కాలంలో ఒక్కసారి ఉలిక్కిపడి నిద్రలేచిన మాదిరిగా గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా బీసీల ఊసు కూడా ఎత్తడానికి ఇష్టపడని వీళ్లు ఇవాళ బీసీ రిజర్వేషన్ల కొరకు రైలు రోఖో నిర్వహిస్తామని, కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ప్రకటన చేయడం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామనటం కేవలం ఏరుదాటాక తెప్ప తగలేయడం లాంటిదని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఆరోజుల్లో నీకు సంపాదనకే సమయం సరిపోలేదని, ఆ సంపాదనలో పడి బీసీలను పూర్తిగా మర్చిపోయిన మీరు ఈ రోజు ఏ పదవి లేక రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయారని దుయ్యబట్టారు. కాబట్టి ఉపాధి హామీ పథకం మాదిరిగా ఈ రోజు బీసీలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నాలు చేయడం చాలా విచారకరమన్నారు. గతంలో ఈ విధంగానే ఈమె చేసిన ప్రయత్నం లిక్కర్ స్కాములో అరెస్ట్ అయిన సందర్భంగా ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ల పేరుతో పార్లమెంట్లో బిల్లు పెట్టాలని నాటకమాడిందని ఆ నాటక అంకం ఆ రోజుతోనే ముగిసిపోయిందన్నారు. ఇదంతా ఆమె తండ్రి కేసీఆర్ కు తెలిసే ఆయన ఆడిస్తున్న నాటకమేనని సాయిబాబా అన్నారు. ఈ నాటకాన్ని ప్రజలు విశ్వసించవద్దని కోరారు. వేల కోట్లు అక్రమంగా సంపాదించు కోవడమే వీరి ప్రధాన లక్ష్యం అని, అసలు బీసీల మీద ఎటువంటి ప్రేమ లేదని, ఇదంతా బూటకమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, నాయకులు ఎస్.ప్రకాష్, బాను ప్రకాష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply