తక్షణమే ఉద్యోగాల‌ భర్తీకై నోటిఫికేషన్స్ వేయాలి

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
తక్షణమే ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్స్ వేయాలి
ఉద్యోగాల సాధనకై డివైఎఫ్ఐ రాష్ట్రవ్యాప్త ఉద్యమం
–  డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్

హైద‌రాబాద్‌, జూలై 5, ( అద్దం న్యూస్ ) :      నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని, తక్షణమే ఉద్యోగాల భర్తీకై నోటిఫికెషన్స్ వేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేసారు. ఆదివారం హైద‌రాబాద్‌లో సిఐటియు న‌గ‌ర కార్యాల‌యంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ ) హైదరాబాద్ నగర 21 వ జిల్లా మహాసభ జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిధిగా హాజరైన డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నిరుద్యోగులందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఎన్నికల మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయిన ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ తో పాటు ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని విమ‌ర్శించారు. సమగ్రమైన వివరాలతో జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వేయాలన్నారు. అదే విధంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంత వరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇవ్వాలని, స్వయం ఉపాధి రుణాలపై రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించి లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడం లేదన్నారు.

దరఖాస్తులకే పరిమితం కాకుండా అర్హులైన నిరుద్యోగ యువత అందరికి రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో 20వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయానా డిజిపి ప్రకటించినా కూడా ఇప్పుడు కేవలం 7000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు వేయడం నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుందన్నారు. పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జావీద్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోనే సుమారు పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 60 లక్షల పైగా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు హస్మి బాబు, జిల్లా డివైఎఫ్ఐ మాజీ నాయకులు మహేందర్, విజయ్ కుమార్, అశోక్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ రెడ్డి, లెనిన్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు అనిల్ కుమార్, దేవేందర్, రాజయ్య, సునీల్, వేణు, శ్రీనివాస్, అన్వేష్, కృష్ణ, ఆదిత్య తదితరులు పాలొగొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page