దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
– పలువురి వక్తల డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 10, అద్దం న్యూస్ : దేశంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో బుధవారం ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ అధ్యక్షుడు గద్దపాటి విజయరాజు, అంబేడ్కర్ దళిత సేన అధ్యక్షుడు జేబీ రాజు, కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, బంధు సొసైటీ అధ్యక్షుడు పల్లెల్ల వీరస్వామి, ప్రొఫెసర్ నతానియల్, డేవిడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దళిత క్రైస్తవులకు మతం ఆధారంగా ఎస్సీ హోదా నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం అని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని బలంగా 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ( 2004-2007 ) సిఫార్సు చేసిందని తెలిపారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని 2009లో ఏఐసిఎఫ్ సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసిందన్నారు. మతం మారితే కులం మారదని ఎస్సీలు క్రైస్తవ మతం స్వీకరించినప్పటికీ వారిపై సామాజిక వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మతం మారినంత మాత్రాన వారి సామా జిక, ఆర్థిక స్థితి మారదన్నారు. దళిత క్రైస్తవు లను ఎస్సీ హోదా నుంచి దూరం చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. ఇది సామాజిక న్యాయ స్ఫూర్తికే విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వారికి ఎస్సీ హోదాను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విసికె పార్టీ నాయకుడు శ్యామ్, డీబీఎఫ్ జాతీయ కన్వీనర్ పి.శంకర్, మనోజ్ బాబు, రావు తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply