వనస్థలిపురంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు
వనస్థలిపురం, సెప్టెంబర్ 16, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని విశ్రాంత ఉద్యోగుల సంఘం రంగారెడ్డి జిల్లా నేతృత్వంలో వనస్థలిపురం జనప్రియ నగర్ సీనియర్ సిటిజన్ భవనంలో సాయుధ పోరాట స్ఫూర్తి సభ జరిగింది. ఈ సభకు సీనియర్ సిటిజెన్లు, పెన్షనర్లు, అభ్యుదయనగర్, ప్రశాంత్ నగర్, నాయకులు హాజరై తెలంగాణ సాయుధ పోరాట సందర్భము, ప్రాముఖ్యతల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా అడ్వకేట్ కట్ట భగవంత రెడ్డి మాట్లాడుతూ… నిజాం సంస్థానంపై సైనిక చర్య పేరుతో యూనియన్ సైన్యం కమ్యూనిస్టులను ఊచపోత కోశారని, భూములు వదిలి పారిపోయిన భూస్వాములకు అండగా నిలిచారని, అది ప్రజా ఉద్యమం పై విద్రోహమేనని, పుట్టబోయే నూతన సమాజ గర్భస్థ శిశువును అంతం చేయడం వంటిదని విచారం వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో మంది అమరులయిన వారికి నివాళులర్పించారు. యాదయ్య మాట్లాడుతూ… రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కాచం కృష్ణమూర్తి అడివయ్యల నేతృత్వంలో అనేక భూ పోరాటాలు నిర్వహించి పేదలకు భూములు పంపిణీ చేయటం అయిందని, ఆ స్ఫూర్తితో నేటి రియల్ ఎస్టేట్ మాఫియాలను కట్టడి చేయాలని అన్నారు.
డోకూరీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… తమ గ్రామ సమీప ప్రాంతమైన పలివెలలో జుగాల్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి వీరోచిత పోరాట అనుభవాలను నెమరేసుకున్నారు. చిత్తశుద్ధితో కూడిన పోరాటాలు అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా సాగాలని కోరారు. పాలకుర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ… ఆనాటి పోరాట స్ఫూర్తితో కార్మిక కర్షక ఉద్యోగ పెన్షనర్లు అంతా తమ న్యాయబద్ధ హక్కులకై పోరాటాలు కొనసాగించాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా టాప్రా ఉపాధ్యక్షురాలు అనసూయ మాట్లాడుతూ… సాయుధ రైతాంగ పోరాటంలో మహిళల పాత్ర గణనీయమైనదని అమరులు చిట్యాల ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, సుగుణమ్మ, సరోజమ్మ ,లక్ష్మమ్మల త్యాగాలు గుర్తు చేశారు. నగ్నంగా మహిళలతో బతుకమ్మ లాడించిన నైజాం క్రూరత్వానికి బలైన వేలాది మంది మహిళల పోరాట స్ఫూర్తితో నేడు తమ సామాజిక రాజకీయ హక్కులకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు, సుదర్శన్ రెడ్డి, బ్రహ్మచారి, బీజెయం రెడ్డి, భాస్కర్ రాజు, రంగయ్య చౌదరి, రాజేందర్ రెడ్డి, డాక్టర్ కేశవరావు, పల్లా గోవర్ధన్, రవీందర్ రెడ్డి, నాగయ్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply