నిర్లక్ష్యానికి బాలుడి బలి
బాలుడిని ఢీకొట్టిన టాటాఏస్ వాహనం డ్రైవర్
– భోలక్పూర్లో విషాదం
హైదరాబాద్, జూన్ 27, ( అద్దం న్యూస్ ) : పెళ్లి రోజే తమ కన్న కొడుకు మృతితో ఓ తల్లిదండ్రులకు విషాదం మిగిలింది. తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న నాలుగేళ్ల బాలుడిని ఓ వాహనం ఢీకొట్టిన ఘటనలో ఆ బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్పూర్లో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి… భోలక్పూర్ గంగపుత్రకాలనీకి చెందిన మహేశ్ గౌడ్, సంతోషి దంపతులకు కుమారుడు శ్రీయాన్స్ ( 4 ), కుమార్తె ఉన్నారు. మహేశ్ గౌడ్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఇదిలా ఉండగా మహేష్ గౌడ్, సంతోషి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా శనివారం ఉదయం కుటుంబసభ్యులందరూ గుడికి వెళ్లి వచ్చారు. ఇంటికి వచ్చిన సంతోషి తన కొడుకు శ్రీయాన్స్తో కలిసి స్థానికంగా ఉండే దుకాణానికి నడుచుకుంటూ సంతోషి ముందు వెళ్తుండగా, ఆమె వెనకాల శ్రీయాన్స్ వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో ( టిజి 09 యు 1011 ) నంబర్ గల టాటాఏస్ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఆ వాహనాన్ని శ్రీయాన్స్ పై నుంచి తీసుకెళ్లాడు. వాహనం ముందు టైర్ల కింద నలిగిపోయిన శ్రీయాన్స్ తీవ్ర గాయాలతో ఘటనా స్థలిలోనే మృది చెందాడు. వెనక్కు తిరిగి చూసిన శ్రీయాన్స్ తల్లి సంతోషి కేకలు పెట్టగా స్థానికులు వాహనం డ్రైవర్ను పట్టుకుని ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సిసి పుటేజి ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ను అందుబాటులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.
బాలుడి మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి :
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి శ్రీయాన్స్ అనే బాలుడి మృతికి కారకుడైన టాటాఏస్ వాహనం డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని స్థానికులు భోలక్పూర్, కవాడిగూడ ప్రధాన రోడ్డు మార్గంలో నిరసన చేపట్టారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ అయింది. రాకపోకలు ఆగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని సముదాంచారు. దీంతో స్థానికులు నిరసనను విరమించుకున్నారు.












Leave a Reply