హైదరాబాద్, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన మనోజ్ కుమార్ మృతికి గల కారణం ఆర్థిక ఇబ్బందులు, అప్పల భారమే అని తెలిసింది. చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ మధుబాబు తెలిపిన వివరాలు ప్రకారం… ముషీరాబాద్ పరిధిలోని పార్శీగుట్టకు చెందిన సోమారపు మనోజ్ కుమార్ ( 29 ) ప్రైవేట్గా ఇంటింటికీ తిరిగి అపోలో హాస్పిటల్స్ నిమిత్తం రక్త, ఇతర పరీక్షల నమూనాలు సేకరించే పని చేస్తుంటాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు అప్పుల బాధ తాళలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల స్టీల్ బ్రిడ్జిపైకి చేరుకుని, తన ద్విచక్ర వాహనాన్ని పక్కన నిలిపాడు. బైక్పై తన మొబైల్ ఫోన్ పెట్టి బ్రిడ్జి పై నుంచి కిందికి దూకాడు.
పైనుంచి కింద పడటంతో తీవ్ర గాయాలై మనోజ్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మనోజ్ తన మరణానికి గల కారణాలను మొబైల్లో రాశాడు. తన కష్టకాలంలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పులు ఇచ్చి ఆదుకున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, తన ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని రాసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒక్కడే ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడి స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తూ దర్యాప్తు జరుపుతున్నారు. కాగా మృతదేహాన్ని తన అక్కకు అప్పజెప్పినట్టు పోలీసులు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
