త్వరలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు  – మంత్రి పొన్నం ప్రభాకర్

 

త్వరలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు  

– అంబర్‌పేట‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్

త్వరలోనే గౌతు లచ్చన్న ఆడిటోరియం ప్రారంభిస్తాం – విహెచ్

 

అంబ‌ర్‌పేట్‌, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ :   త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఆధ్వర్యంలో శ్రీ రమణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభ అంబ‌ర్‌పేట్‌ శ్రీ రమణ చౌరస్తాలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఎఐసిసి సెక్రెటరీ విశ్వనాథ్, ఎఐసిసి సెక్రటరీ, ఎమ్మెల్యే విష్ణునాథ్ తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆశయాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి వి.హనుమంతరావు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి అమలు చేస్తున్నమని వివరించారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రాజకీయ, ఉపాధి ,విద్య అవకాశం కల్పించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణకు జాతీయస్థాయిలో రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నంలో భాగస్వాములుకావాలన్నారు. హనుమంతరావు కోరిన విధంగా త్వరలోనే అంబర్ పేట్ లో గౌతు లచ్చన్న ఆడిటోరియ నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ.. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగిందని, గత ఐదు సంవత్సరాల పోరాట ఫలితంగా ఆంబర్‌పేట్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు . కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ కుంటను భూ కబ్జాదారుల నుంచి కాపాడుకోవడంతో పాటు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నమని తెలిపారు. త్వరలోనే అందరికీ ఉపయోగపడే విధంగా గౌతు లచ్చన్న ఆడిటోరియం, సావిత్రి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తామన్నారు. ఏఐసిసి సెక్రెటరీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, సిపిఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే కమలాకర్, ఇందిరా శోభన్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, టిపిసిసి కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ రామ్మోహన్, గడ్డం శ్రీధర్, కోటం అనిల్, మహేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page