సిటి కల్చరల్, అద్దం న్యూస్ : భారతకళా ప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ 102 వ జయంతి, స్వర నర్తన సంస్థ 10వ వార్షికోత్సవ సందర్భంగా నృత్య నీరాజనం కార్యక్రమం సంస్థ వ్యవస్థాపకురాలు దెందులూరి పద్మమోహన్, కర్నాటి నవత ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఐఎఫ్ఎస్ దెందులూరి నళిని మోహన్, ప్రముఖ కూచిపూడి నాట్యగురువు డాక్టర్ భాగవతుల సేతురామ్, ప్రముఖ కథక్ నాట్య గురువులు అంజి బాబు, గురువు కళా కృష్ణ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
నటరాజ రామకృష్ణతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకొని, ఆంధ్ర, పేరిణి నృత్యాల అభివృద్ధి కోసం రామకృష్ణ చేసిన సేవను కొనియాడారు. అనంతరం స్వర నర్తన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మామోహన్ మాట్లాడుతూ.. ఆంధ్ర నాట్య అభివృద్ధికి సంస్థ ఎంతగానో కృషి చేస్తున్నట్లు తెలిపారు. వివిధ కార్యక్రమాల నిర్వహించి కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. కళల సహకారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గురు కళా కృష్ణ నేతృత్వంలో నటరాజ రామకృష్ణ శిష్యులు 12 మంది కళాకారులు ఆంధ్ర, పేరిణి నాట్యంశాలను ప్రదర్శించారు. ప్రముఖ హరికథ భాగవతారిని పద్మశ్రీ ఉమామహేశ్వరి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమంలో స్వర్ణ నర్తన సంస్థ సభ్యులు సునీల, స్రవంతి, సంధ్య, పవన్, కల్పన, మహతి, సాయి, ధర్మ, నర్తన, నికిత, సాయి, సంతోష్ పాల్గొన్నారు.
