Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalఈ నెల 9, 10వ తేదీల్లో శ్రీ కనకాల కట్ట మైసమ్మ బోనాల జాతర

ఈ నెల 9, 10వ తేదీల్లో శ్రీ కనకాల కట్ట మైసమ్మ బోనాల జాతర

📰 Generate e-Paper Clip

ఈ నెల 9, 10వ తేదీల్లో శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో బోనాల జాతర
– జాతరకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ

హైద‌రాబాద్‌, ఆగస్టు 7, ( అద్దం న్యూస్ ) :   ఆషాడ బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లోని శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఈ నెల 9వ తేదీన బోనాలు, 10 వ తేదీన రంగం కార్యక్రమం ఉంటుందని ఆలయ వ్యవస్థాపక చైర్మన్ గోల్కొండ గౌతమ్ కుమార్, ఆలయ కార్యనిర్వాహ‌ణాధికారి పి.మహేందర్ గౌడ్, ఆలయ ప్రధాన అర్చకుడు సాత్విక్ శర్మ లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో బోనాల ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బోనాలు ఉత్సవంలో భాగంగా ఈ నెల 9వ తేదీన అమ్మవారికి పంచామృత అభిషేకం, సుగంధ భరిత పుష్పాలంకరణ, బాల భోగము, అమ్మవారి దివ్య దర్శనం ఉంటుందన్నారు. అదే రోజు రాత్రి 12 గంటలకు అమ్మవారికి నిషి పూజ బలిహరణ ద్వార బంధనం ఉంటుందన్నారు. 10 వ‌ తేదీ ఉదయం 5:30 గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకం, ప్రత్యేకమైన రక్తాక్షి అలంకరణ, బాల భోగము, అమ్మవారి దర్శనం ఉంటుందన్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం నుంచి బయలుదేరి పింగళి వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ నుండి ఘటోత్సవం ఆలయ ప్రవేశం ఉంటుందన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి ఆలయంలో గంగతెప్పకు పూజారి బలిహరణ జరిపి ఊరేగింపుగా హుస్సేన్ సాగర్ లోని గంగాదేవికి పూజలు చేయడం జరుగుతుందన్నారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారి ఆలయం మండపంలో అమ్మవారిని అవగాహన చేసి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 7 గంటలకు దేవదాసి స్వర్ణలతతో పచ్చి కుండపై భవిష్యవాణి వినిపిస్తార‌న్నారు.

  అదే రోజు రాత్రి ఎన్ని గంటలకు పోతరాజుల విన్యాసాలతో పాటు బ‌ర్దిపాలు వరదగావు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. భ‌క్తుల‌కు తాగునీరు, ప్రసాదం, వైద్య సదుపాయం, తాత్కాలిక మరుగుదొడ్లు, క్యూలైన్లు, బ్యారికేడ్లు, విద్యుత్ వెలుగులు, పారిశుద్ధ్య ఏర్పాట్లు కల్పించామ‌ని పేర్కొన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనుండగా, శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. పోలీసు అధికారులు, ఆలయ వాలంటీర్ల సూచనలను భక్తులు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆల‌య సిబ్బంది సతీష్ కుమార్, అర్చ‌కులు, సిబ్బంది రాజేష్ శర్మ, రాంబాబు శర్మ, లక్ష్మీ నరసింహ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page