జనగణన, కులగణన పై బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఖరి ఒక్కటే
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జనవరి 29, అద్దం న్యూస్ : జనగణన, కులగణన పై బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఒక్కటే వైఖరి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాతీయ జనగణనలో కులగణన పై గురువారం హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కవిత హాజరై మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దేశ వ్యాప్తంగా జనగణన, కులగణన పై ఎక్సర్ సైజ్ జరుగుతోందన్నారు. నిజానికి పదేళ్ల కు ఒకసారి జనగణన చేయాలని, 2021 లో జనగణన చేయాల్సి ఉండే అని.. కానీ కోవిడ్ కారణంగా జనగణన చేయలేదన్నారు. అయితే కులగణన పై అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ రావటంతో కేంద్రం అందుకు అంగీకరించిందన్నారు. నిజానికి కులగణన చేయాలన్న బుద్ది బీజేపీ రావటం మమ్మల్ని ఆశ్చర్యపరించిందన్నారు. జనగణన చేసినప్పుడే ఏ వర్గం ఎంత ఉంది ? వారికి బడ్జెట్, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయన్నది తెలుస్తుందన్నారు. కులగణనకు కేంద్రం ముందుకు రావటంతో సంతోషించాం.. కానీ ఎప్పుడైతే డాక్యుమెంట్ విడుదల చేశారో అప్పుడే వాళ్ల బుద్ది బయట పడిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ ల కాలమ్ పెట్టారు… ఓబీసీ లేకుండా కులం అనే కాలమ్ మాత్రమే డాక్యుమెంట్లో పెట్టారన్నారు. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ…భారత ప్రజలను మోసం చేస్తోందన్నారు. కులాల విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కులాలను పిలుస్తారన్నారు. నన్నే తీసుకుంటే నేను వెలమ. తెలంగాణలో ఓసీ, మహారాష్ట్రలో ఎస్సీ, ఏపీ లో బీసీని అన్నారు. చిన్న సంఖ్యలో ఉన్న కులానికే ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయని, మరి 56 శాతం ఉన్న బీసీల విషయంలో ఎంత గందరగోళం ఉంటుందో ఆలోచించాలని కవిత అన్నారు.
గతంలో అగ్రకులాల్లో పేదలకు రిజర్వేషన్లు ఇచ్చారు. వాళ్లు ఏ కేటగిరీలో వస్తారో చెప్పలేదని, ఇవ్వాళ మన రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని కమ్యూనిటీల వాళ్లు వచ్చారన్నారు. మనం ఇచ్చే అభిప్రాయం రిజర్వేషన్ల విషయంలో కేంద్రానికి సూచికలా ఉండాలన్నారు. బీజేపీ కులగణన విషయంలో ఇచ్చిన మాట తప్పినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ అంశంపై చర్చ జరుగుతోందని, తెలంగాణ నుంచి మన అభిప్రాయం కూడా ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని తెలిపారు. తెలంగాణలో ఉన్న కులాలు, వాటి ఉపకులాల నివేదిక జాగృతి సిద్ధం చేస్తుందని స్పష్టం చేశారు. నిజానికి ఈ పని ప్రభుత్వమే చేయాలి… కానీ వాళ్లకు చిత్తశుద్ది లేదని.. అందుకే మేము అందరినీ ఒపీనియన్స్ తీసుకోవాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ థింక్స్, ఇండియా ఫాలోస్ నెక్స్ట్ అనే విధంగా మనం ఉంటామన్నారు. కులగణన విషయంలోనూ మనం అదే విధంగా నివేదికను కేంద్రానికి ఇద్దామని తెలిపారు. ప్రతి కులానికి అన్ని హక్కులు సాధించుకునేలా ప్రయత్నం చేద్దామన్నారు. ఇలాంటి అంశంలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమన్నారు. కచ్చితంగా ఈ అంశంపై ప్రతి పార్టీకి ఒక స్టాండ్ ఉండాలని, బీజేపీయే డాక్యుమెంట్ విడుదల చేసింది.. కనుక వాళ్లు ఆ డాక్యుమెంట్గా మద్దతుగా మాట్లాడుతున్నారన్నారు. కానీ అన్ని పార్టీలు కూడా తమ స్టాండ్ ఏంటో చెప్పాల్సిందే కవిత అన్నారు.![]()

