విపత్తు నిర్వహణ కమిటీని హైడ్రాకు బదిలీ చేసి అద్వాన పరిస్థితిని తీసుకొచ్చిన సీఎం
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా

హైదరాబాద్, ఆగస్టు 20, అద్దం న్యూస్ : వరుసగా వర్షాలు కురుస్తుండడంతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మురుగు నీరు నిలిచిపోయి, పారిశుద్ధ్యం లోపించడం వల్ల దుర్వాసనకు జనం పరుగులు తీస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విపత్తు నిర్వహణ కమిటీని జిహెచ్ఎంసి నుండి హైడ్రాకు బదిలీ చేయడంతో పరిస్థితి అద్వానంగా తయారయ్యిందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులుపడుతుంటే జిహెచ్ఎంసి చూస్తుందని హైడ్రా అధికారులు, హైడ్రా చూస్తుందని జిహెచ్ఎంసి అధికారులు, ఎవరూ స్పందించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ చేపట్టాల్సిన భాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ విపత్కరమైన పరిస్థితులలో బాధ్యత రహితంగా ప్రవర్తించడం విడ్డూరంగా ఉందన్నారు. శివారు ప్రాంతాలైన కుత్బుల్లాపూర్లోని పద్మానగర్, మాదన్నపేట, బాలానగర్లోని రాజీవ్ గాంధీనగర్, గచ్చిబౌలిలోని ఓఆర్ఆర్ ఎక్స్ రోడ్, కొండాపూర్లోని కేఎంఆర్ ఎస్టేట్ వద్ద, బేగంపేటలోని వసంతనగర్, పాటిగడ్డ తదితర ప్రాంతాల్లో పొంగిపొర్లతున్న డ్రైనేజీ వల్ల స్థానికులు సతమతమవుతున్నారని అన్నారు. గత వారం రోజులుగా మూసీ నది ఉప్పొంగడంతో లంగర్హౌజ్లోని బాపూఘాట్ వద్ద గాంధీ సమాధి ప్రాంగణంలో బురద పేరుకు పోయిందన్నారు. గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు బాపూ ఘాట్ వద్ద గాంధీ సమాధిని పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో గాంధేయ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సాయిబాబా తెలిపారు. కాంగ్రెస్ పాలనలో గాంధీకి గౌరవం ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. నాలాలు పొంగి వర్షపు నీరు రోడ్లపై వరదలా ప్రవహించి బైకులు, కార్లు కొట్టుకుపోతున్నా చేసేదేమీ లేక చూస్తూండి పోయారన్నారు. స్థానిక కార్పొరేటర్లు గాని, ఏ ప్రజాప్రతినిధి గానీ పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పాలనలో కీర్లోస్కర్ కమిటీని రూపొందించి దాని ప్రకారము చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కమిటి సూచనల మేరకు నాలాల పరిరక్షణ చేపట్టడం నాలాల పరిరక్షణకు రిటైనింగ్ వాలులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్న ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలియజేయాలని, వెంటనే గాంధీ సమాధి ప్రాంతాన్ని శుభ్రపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply