కనీస వేతనాల పేరిట కార్మికులను మోసం చేయకండి
– కేంద్ర కార్మిక శాఖ మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, మే 22, ( అద్దం న్యూస్ ) : కనీస వేతనాల పేరిట కార్మికులను మోసం చేయవద్దని సీఎం రేవంత్రెడ్డిని కేంద్ర కార్మిక శాఖ మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలోని అసంఘటిత కార్మికుల హక్కులను ప్రభుత్వం కాపాడాలని, కార్మికుల సమస్యలను మానవీయ దృక్పథంతో పరిశీలించి న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని బండారు దత్తాత్రేయ కోరారు. అన్ స్కిల్ల్డ్ కార్మికులకు రూ.22 వేలు, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.27 వేలు, స్కిల్డ్ కార్మికులకు రూ.31 వేలు, హై స్కిల్డ్ కార్మికులకు రూ.36 వేల రూపాయల వరకు వేతనాలు నిర్ణయించాలని బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. రాష్ట్ర జీడీపీ పెరుగుతున్నప్పుడు కార్మికుల ఆదాయం కూడా పెరగాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు ఒక కోటి 20 లక్షల మంది కార్మికులు కనీస వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. “ వేతనం వరం కాదు.. కార్మికుడి హక్కు ” అని దత్తాత్రేయ స్పష్టం చేశారు. కార్మికుడి చెమటతోనే పరిశ్రమలు, నిర్మాణ రంగం, నగరాల అభివృద్ధి సాధ్యమవుతోందని వారు పేర్కొన్నారు. అభివృద్ధి అంటే కేవలం భారీ భవనాలు, పెట్టుబడులు కాదని, కార్మికుని కుటుంబం గౌరవంగా జీవించే పరిస్థితి రావడమే నిజమైన అభివృద్ధి అని వారు అన్నారు.
గత 14 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కనీస వేతనాల అంశాన్ని ప్రభుత్వం తూతూమంత్రంగా పరిష్కరించి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం పెంచిన వేతనాలు “ గుడ్డిలో మెల్ల ” అన్నట్లుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పేరుకే వేతనాల పెంపు చేసి వాస్తవ పరిస్థితులను విస్మరించారని మండిపడ్డారు. విద్య, వైద్యం, ఇంటి అద్దెలు, రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు కార్మికుల జీవన అవసరాలకు సరిపోవడం లేదన్నారు.![]()

![]()












Leave a Reply