స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలను నిర్వహించాలి
లేని పక్షంలో రాష్ట్రంలో యుద్ధమే – బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
బిసి రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి
– వకుళాభరణం కృష్ణమోహన్ రావు

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య
అంబర్పేట్, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ : స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలను నిర్వహించాలని లేనిపక్షంలో రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని, ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ బిసి బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు కాచిగూడ అభినందన్ హోటల్లో విలేకరుల సమావేశాన్ని బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతికి పంపడం అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ లో బీసీలకు 42 శాతం ప్రకటించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామన్నారు. ప్రత్యేక జీవో ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. బిసి వ్యతిరేకంగా చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. పార్టీలకు అతీతంగా బీసీ నాయకులందరూ ఆయా పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పూర్వ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు.. మాట్లాడుతూ.. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లులపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలే స్థానిక రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలను నిర్వహించవచ్చని వివరించారు. గతంలో అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలను పక్కదోవ పట్టించిందని విమర్శించారు. స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసి మేధావులు, న్యాయనిపుణులు సలహాలు తీసుకొని మళ్ళీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తప్పుడు విధానాలతో ప్రభుత్వం ముందుకు పోతుందని ఆరోపించారు. జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో అనేక ఉద్యమాలను చేశామని గుర్తు చేశారు. బీసీలకు చెందాల్సిన 42 శాతం రిజర్వేషన్లను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బిసి సంక్షేమ సంఘం నాయకులు రాజేందర్, మల్లేష్ యాదవ్, జెల్లా నరేందర్, పృథ్వి గౌడ్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply