హైదరాబాద్, జూన్ 25, అద్దం న్యూస్ : జులై 9 దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో మోటార్ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. బుధవారం హైదరాబాద్ విద్యానగర్ మార్క్స్ భవన్లో టియుసిఐ అనుబంధ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రవీణ్ అధ్యక్షతన ఆటో మోటార్ సంఘాల రాష్ట్ర ఐక్య కార్యచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టియుసిఐ, ఐఎన్టియుసి, ఏఐటీయూసీ, సిఐటియు, బిఆర్టియు, టిఎన్టియుసి, ఐఎఫ్టియు సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టియుసిఐ అనుబంధ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రవీణ్ మాట్లాడుతూ… నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని అన్నారు. ఆ పిలుపును తెలంగాణ రాష్ట్ర ఆటో మోటార్ సంఘాలు అన్ని సంపూర్ణంగా బలపరుస్తూ సమ్మెలో పాల్గొంటున్నాయని అన్నారు. కార్మిక వర్గాన్ని ఎట్టి బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, కార్మిక వర్గానికి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. కనీస పెన్షన్ నెలకు 9000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఫిక్స్ టర్మ్స్ సిస్టం రద్దుచేసి కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని, కేంద్ర రవాణా ( సవరణ ) చట్టం 2019 సవరించాలని, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జులై 3, 4, 5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆటో, లారీ, టాక్సీ, వ్యాన్, ట్రాలీ, గూడ్స్ తదితర వాహనాలతో ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జులై 9న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించాలని బందులో రవాణా రంగం సంపూర్ణంగా బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో టియుసిఐ నాయకులు జి.లింగం గౌడ్, మహమ్మద్ అఫ్జల్, ఐఎఫ్టియుసి రాష్ట్ర అధ్యక్షుడు జి.మల్లేష్ గౌడ్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం, ఎస్.అశోక్, పి.శ్రీకాంత్, బిఆర్టియు నాయకుడు వేముల మారయ్య, చిన్నం బాల నరసింహ, ఐఎఫ్టియు నాయకుడు పి.రామ్ రెడ్డి, ఎల్.కొండల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply