అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కోల స్వప్న, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొండల్ ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్, ఏప్రిల్ 13, అద్దం న్యూస్ : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కోల స్వప్న, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొండల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభలు ఈ నెల 10, 11 తేదీల్లో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రతినిధుల సభలో తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల ప్రధాన కార్యదర్శి కోలా స్వప్న రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కొండల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయినట్టు కోలా స్వప్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దోపిడీ పీడనలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తూ మరిన్ని కళారూపాలను నిర్మిస్తామని, అన్యాయంపై గళం ఎత్తే అరుణోదయ పోరాటాలలో తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. సామ్రాజ్యవాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా ప్రజా కళలను నిర్మిస్తామని ఆమె పేర్కొన్నారు.
నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ప్రజల మధ్య మత వైశమ్యాలు సృష్టించి, ప్రజాసంపదను పెట్టుబడిదారులకు అప్పగిస్తుందని, ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను ఏరిపారేసామని తదుపరి అర్బన్ నక్సలైట్ల అంతు చూస్తామని ప్రశ్నించే గళాలపై బెదిరింపులకు దిగుతోందన్నారు. ప్రజా సంపదను కొల్లగొట్టే శక్తులకు వ్యతిరేకంగా అరుణోదయ తన గళం విప్పి పోరాటాన్ని ఆయుధంగా మారుస్తుందని ఆమె గుర్తు చేశారు. అరుణోదయ రాష్ట్ర మహాసభలను హైదరాబాద్ నగరంలో నిర్వహించినందుకు వాటిని విజయవంతం చేసినందుకు అరుణోదయ రాష్ట్ర కమిటీకి, కవులకు, కళాకారులకు, కార్మికులకు ఆమె ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.













Leave a Reply