ప్రైవేట్ రంగాల్లోనూ రిజర్వేషన్లను సాధించుకుందాం
– బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్.విశారదన్ మహారాజ్
హైదరాబాద్, డిసెంబర్ 30, అద్దం న్యూస్ : బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరికీ ప్రైవేట్ రంగాల్లోనూ రిజర్వేషన్లను సాధించుకోవాల్సిన అవసరం ఉందని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్.విశారదన్ మహారాజ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమరయ్య హాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర ముఖ్య ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో బీసీ ప్రజలకు 50 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ ప్రజలకు 20 శాతం, ఎస్టీ ప్రజలకు 10 శాతం, మత మైనారిటీలకు 10 శాతం రిజర్వేషన్లు కలిపి 90 శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం చేద్దామన్నారు. అందుకు నూతన సంవత్సరం జనవరి నుంచి సామాజిక మహా పోరాటం 90 శాతం రిజర్వేషన్ల వాటాయుద్ధం పేరుతో భారీ ఆందోళనకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలిపారు. పేద అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లను జేఏసీ సమర్థిస్తుందని వారు ఆ పరిధిలోనే ఉండాలన్నారు. అన్ని రంగాలలో బీసీ, ఎస్సీ, ఎస్సీలకు 90 శాతం వాటా దక్కాల్సిందేనని అన్నారు. యావత్ తెలంగాణలో రాష్ట్రం నుంచి జిల్లా, మండలం, గ్రామం వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీని విస్తరించి బలోపేతం చేస్తామని విశారదన్ మహారాజ్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం రాజ్యాధికార సాధనే అంతిమ లక్ష్యంగా జేఏసీ ముందుకు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ స్వధర్మ ఉద్యమం పోస్టర్లను టీ షర్ట్స్, కరపత్రాలను ప్రొఫెసర్లు రామయ్య యాదవ్, నాగం కుమారస్వామి, చంద్రయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నూతన సంపూర్ణ కమిటీని జేఏసీ రాష్ట్ర ముఖ్య ప్రతినిధుల సభలో ఎన్నుకుని ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట రాఘవేంద్ర ముదిరాజ్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు, ఆయా జిల్లాల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.













Leave a Reply