శ్రీ భవాని శంకర దేవాలయంలో 14 నుంచి 16వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవాలు
» 15వ తేదీన శివ పార్వతుల కళ్యాణం
హైదరాబాద్, ఫిబ్రవరి 11, అద్దం న్యూస్ : ఈ నెల 15వ తేదీన జరుగనున్న మహా శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో భోలక్పూర్ డివిజన్ దేవునితోట శ్రీ భవాని శంకర దేవాలయం ముస్తాబు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వాహణ అధికారి బి.జ్యోతి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆలయ ప్రాంగణంలో మహా శివరాత్రికి మహోత్సవానికి సంబంధించిన బ్రోచర్ను ఆలయ కమిటీ చైర్మన్ మేడి సురేష్, ధర్మకర్తలతో కలిసి ఆలయ ఈవో జ్యోతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణ అధికారి బి.జ్యోతి, చైర్మన్ మేడి సురేష్ లు మాట్లాడుతూ… మహా శివరాత్రి సందర్భంగా ఆలయంలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మహా శివరాత్రి మహోత్సవంలో భాగంగా ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 14 వ తేదీ ఉదయం 5 గంటలకు గణపతి పూజ, అఖండ దీపారాధనతో కార్యక్రమాలు ప్రారంభమై అభిషేకాలు, బిల్వార్చన, మహానివేదన, మంత్రపుష్పం, అర్చనలు జరుగుతాయని చెప్పారు.
15 వ తేదీ ఆదివారం ఉదయం 4 గంటల నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పల్లకి సేవ, శివపార్వతుల కల్యాణ మహోత్సవం, లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తామని వివరించారు. 16 వ తేదీ ఉదయం నానా ఫల రసాభిషేకంతో ప్రారంభమై రుద్ర సహిత చండీహోమం, తైలాభిషేకం, అన్నాభిషేకం, మహా నివేదన, మంత్రపుష్పం, వనభోజనోత్సవాలు జరుగుతాయని వివరించారు. మహా శివరాత్రి మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా భక్తులందరినీ కుటుంబ సమేతంగా ఈ మహోత్సవంలో పాల్గొని స్వామి వారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మిక్కిలినేని సురేష్, ఆలయ ధర్మకర్తలు లక్ష్మణ్, నీల్ చందర్, సూర్య చంద్రశేఖర్, సాయిబాబా, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply