భారీ వర్షంతో నగరవాసులు ఇబ్బందులుపడుతుంటే ఢిల్లీ యాత్రలు తగదు
- నగరానికి ఇన్చార్జ్గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్తో ప్రయోజనం లేదు
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, ఏప్రిల్ 4 అద్దం న్యూస్ : భారీ వర్షంతో నగరవాసులు ఇబ్బందులుపడుతుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉపశమనం చర్యలు చేపట్టకుండా స్వార్థ రాజకీయాల స్వప్రయోజనాల కోసం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. నగరానికి ఇన్చార్జ్గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్తో ప్రయోజనం లేదన్నారు. శుక్రవారం దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, సుక్రవేది లతో కలిసి సాయిబాబా మాట్లాడారు. గురువారం నగరంలో కురిసిన భారీ వర్షం వల్ల సామాన్య, పేద ప్రజల జీవితాలు అస్తవ్యస్తమై, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. “రోమ్ నగరం తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్టు” ఉంది కాంగ్రెస్ నాయకుల వ్యవహారం అని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరానికి ధీటుగా మరో నగరాన్ని సృష్టిస్తామని ప్రగల్బాలు పలికే ప్రభుత్వం, విశ్వనగరాన్ని కాస్త విషాద నగరంగా మార్చారన్నారు. వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు, హుస్సేన్సాగర్, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారన్నారు. నగరంలో పలుచోట్ల కరెంటు స్తంభాలు, చెట్లు పడిపోయి రవాణాకు అంతరాయం కలుగుతున్నా ప్రభుత్వం, అధికారులు గుడ్డివాడిలా వ్యవహరిస్తున్నారని, ఎటువంటి సహాయక చర్యలు చేపట్టక పోవడంతో పలు చోట్ల ప్రజలు చీకట్లో మగ్గుతున్నారని అన్నారు. చాలా బస్తీలలో చెట్లు, విద్యుత్ స్థంబాలు పడిపోయినా ప్రభుత్వం ఎటువంటి సహయక చర్యలు చేపట్టక పోవడం, కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. వర్షం వచ్చిందంటే కచ్చా మోరీలు, నాలాలు నిండిపోయి నగర ప్రజలకు నరకం తప్పేలా లేదన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్ హైటెక్ సిటీ కొద్ది పాటి వర్షానికి చెరువులను తలపించే పరిస్థితి నెలకొందన్నారు. గంటల కొద్ది ట్రాఫిక్ జాములతో సామాన్య ప్రజల బతుకు నరకంగా మారిందన్నారు.
వర్షాల వల్ల నీట మునిగిన ప్రాంతాలలో నగరానికి చెందిన మంత్రులు గాని, ప్రతిపక్ష నాయకులు గాని, జిహెచ్ఎంసి అధికారులు గానీ పర్యటించి ప్రజల గోడు వినే నాథుడే లేరని విమర్శించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) అధికారులు పాపర్టీ టాక్సులు, ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ ల పేరిట వసూళ్లు చేస్తున్నారన్నారు. వసూళ్లపై పెట్టే శ్రధ్ద ప్రజల ప్రాణాల విషయంలో లేదని మండిపడ్డారు. కేవలం రాజకీయ జిమ్మిక్కులతో ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వం ప్రజల కోసం పాటుపడిందేమి లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయడు ముందస్తుగా నాలాల పూడికతీత పనులు చేపట్టి నగర ప్రజలను అప్రమత్తం చేసి, లోతట్టు ప్రాంతాలలో పర్యటించి, హెలిక్యాప్టర్ల ద్వారా ఆపదలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని గుర్తు చేశారు. చంద్రబాబు కీర్లోస్కర్ కమిటీ నివేదికలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఇప్పడే పరిస్థితి ఈ విధంగా ఉంటే వర్షాకాలంలో పరిస్థితి అంచనా వేసుకోవచ్చన్నారు. కాబట్టి రానున్న వర్షాకాలం దృష్ట్యా ముందస్తు ప్రణాళికలు రూపొందించి, అధికారులను అప్రమత్తం చేయాలన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply