హామీలు అమలు చేయాలని మున్నూరుకాపుల మహాధర్నా
మంత్రివర్గంలో మున్నూరుకాపులకు ప్రాతినిధ్యం కల్పించాలి
- మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్
హైదరాబాద్, ఏప్రిల్ 13, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్నూరుకాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మున్నూరుకాపులు మహాధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మున్నూరుకాపులు, రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రైతులు తీసుకువచ్చిన వరి దాన్యం, మొక్కజోన్న కర్రలు, ఇతర వ్యవసాయ పనిముట్లకు మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ పూజలు చేసి మహాధర్నా దీక్షను ప్రారంభించారు. అనంతరం ఉగ్గే శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ… ముఖ్యంగా మున్నూరుకాపులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్లు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మున్నూరుకాపులకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని, లేని పక్షంలో మున్నూరుకాపుల సంఘటిత శక్తిని ప్రభుత్వం చూడాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోకాపేటలో మున్నూరుకాపులకు కేటాయించిన 5 ఎకరాలు, రూ. 5 కోట్లు నిధులు భవన నిర్మాణానికి సరిపోవని, మరో రూ.20 కోట్లు కేటాయించి భవన నిర్మాణం పూర్తయ్యే విధంగా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కాచిగూడలోని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోమెంట్ పరిధి నుంచి తొలగించి మున్నూరుకాపులకు అప్పగించాలన్నారు. మున్నూరుకాపుల పేరు చివరన పటేల్ అని ప్రభుత్వమే గెజిట్ చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్నూరుకాపులకు జనాభా ప్రాతిపదికన సీట్లు ఇవ్వాలని, 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు.
ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై వెంటనే స్పందించి పరిష్కరించాలని లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. రాజ్యాధికార సాధనే మున్నూరుకాపుల అంతిమ లక్ష్యం కావాలని, ఆ లక్ష్య సాధన కోసం మున్నూరుకాపులు అలందరూ సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ పిఎల్ఎన్ పటేల్, అర్జున్ తడబోయిన, బాల శ్రీనివాస్, చామకూర సుజాత, మామిండ్ల ఆశోక్, రోజారాణి, గుంటి మంజుల, బిల్లకంటి శ్రీనివాస్, కటికం మహేష్, బత్తుల రాములు, అనిల్, శ్రీనివాస్, పిడికిలి రాజు, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
Leave a Reply