మహిళల శ్రమను గుర్తించడమే సరైన గౌరవం
» తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్, మార్చి 8, అద్దం న్యూస్ : సమాజంలో మహిళల శ్రమను గుర్తించడమే వారికి ఇచ్చే సరైన గౌరవమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్లోని ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ డివిజన్ రాంనగర్ గుండు వద్ద తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సయ్యద్ మదర్ సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ ఇమామ్ సహకారంతో చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదండరాం హాజరై పారిశుద్ధ్య కార్మికులకు చీరలను అందచేశారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ… సమాజంలో మహిళలకు సముచిత స్థానం కల్పించినప్పుడే ఆ సమాజ అభివృద్ధి సమగ్రంగా జరుగుతుందని అన్నారు. ఇంటా బయట మహిళలు వివక్షతకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరి పైన ఉందని పేర్కొన్నారు. మహిళలు ఇంట్లో చేసే ప్రతి పని నుంచి బయట కార్యాలయాలలో చేసే పని వరకు గుర్తింపునిస్తూ సరైన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డివిజన్ అధ్యక్షుడు కాకునూరి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.నరసయ్య, జన సమితి నాయకులు పుష్పలీల, రాణి జైపాల్ రెడ్డి, జస్వంత్, రామచందర్, రవీందర్ యాదవ్, హనుమంతు గౌడ్, లక్ష్మణ్, స్థానిక అపార్ట్మెంట్ వాసులు అపర్ణ, అరుణ, పద్మ, శోభ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళా కార్మికుల సమక్షంలో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.















Leave a Reply