కేంద్రం ముందు మోకరిల్లి స్మార్ట్ మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్న రేవంత్ సర్కార్
– తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఆగస్టు 24, ( అద్దం న్యూస్ ) : కేంద్రం ముందు మోకరిల్లి స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు రేవంత్రెడ్డి సర్కార్ కుట్ర చేస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ఫ్రీ కరెంట్, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఫ్రీ కరెంట్ ఎత్తివేసే కుట్ర చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు పెడితే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని కవిత హెచ్చరించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ… కేంద్రం తెచ్చిన కొత్త పథకంపై సంతకం పెట్టి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తోందని విమర్శించారు. గతంలో రైతులను ఇబ్బంది పెట్టేలా చేసిన నల్ల చట్టాల్లో భాగంగా తేవాలనుకున్న స్మార్ట్ మీటర్లను మళ్లీ తేవాలని కేంద్రం చేస్తున్న కుట్రలకు రేవంత్ సర్కార్ మోకరిల్లిందన్నారు. అదానీ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు, ప్రజలకు నష్టం చేసేందుకు ఈ స్మార్ట్ మీటర్లను తెస్తున్నారని.. దీనికి సంబంధించి ప్రజల మైండ్ వాష్ చేసేందుకు ఇటీవలే నెక్లెస్ రోడ్ లో డెమో కార్యక్రమం పెట్టారన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సీఎండీ కూడా స్మార్ట్ మీటర్లు తెస్తున్నామని చెప్పారన్నారు. గతంలో మనం ఈఆర్సీలో గొడవ చేస్తే రైతుల బావికాడ మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పారు..కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో ఇప్పుడున్నవన్నీ కూడా స్మార్ట్ మీటర్లే.. కానీ కొత్తగా తేనున్న స్మార్ట్ మీటర్ల ద్వారా చాలా నష్టం ఉంటుందన్నారు. ఈ మీటర్ల పెడితే మనం ముందే ఫోన్ లో రీఛార్జ్ చేసుకున్నట్లు ప్రీ పెయిడ్ రీఛార్జ్ చేసుకోవాలన్నారు. దీని ద్వారా మనకు ఎప్పుడు రీఛార్జ్ అయిపోతే అప్పుడు కరెంట్ పోతుందని తెలిపారు. యూపీలో ఇదే విధంగా మీటర్లు పెడితే ఆ మీటర్లను తీసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీస్ లలో ప్రజలు వేసి వెళ్తున్నారని..పైగా స్మార్ట్ మీటర్ల కారణంగా ప్రభుత్వం ఇస్తామన్న 2 వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఎత్తివేసే పరిస్థితి ఉంటుందన్నారు. సెలూన్లకు ఇచ్చే ఫ్రీ కరెంట్ కు కూడా ఇబ్బంది అవుతుందన్నారు. స్మార్ట్ మీటర్ల కారణంగా ఫ్రీ కరెంట్, సెలూన్లకు ఇచ్చే కరెంట్, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సబ్సిడీ కరెంట్ ను ఎత్తివేసే ప్రమాదం ఉందని కవిత తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రక్షణ సేన ఇందుకు ఒప్పుకోదని హెచ్చరిస్తున్నామని కవిత స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.













Leave a Reply