ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 27న ఇందిరాపార్క్ వద్ద TGE JAC ధర్నా
హైదరాబాద్, ఆగస్టు 22, ( అద్దం న్యూస్ ) : ఉద్యోగుల సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం TGE JAC రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని TGO’s హైదరాబాద్ జిల్లా శాఖ పిలుపునిచ్చింది. శనివారం TGO భవన్లో TGO’s హైదరాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎంబి.కృష్ణ యాదవ్, కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన TGO’s రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్ మాట్లాడుతూ… హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులు ఈ నెల 27న జరిగే నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. ఉద్యోగుల హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు, పెన్షన్ భద్రత, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. 2 వ PRC ని వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 6 విడతల DA, DRలను వెంటనే విడుదల చేయాలని, CPS ను రద్దు చేసి OPSను పునరుద్ధరించాలని, నూతన EHS ను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. GHMC పరిధిలో పనిచేస్తున్న అన్ని ప్రాంతీయ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వర్తింపజేయాలని, TGO’s హైదరాబాద్ జిల్లా వార్షిక మెంబర్షిప్ డ్రైవ్–2026ను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జి.ఆశన్న, ఎన్.జి.ఎల్. రెడ్డి, వెంకటరమణ, డాక్టర్ ఎం.సురేందర్, ఎ. రాజేందర్, ఎం.శ్రీనివాసులు, రాధాకృష్ణ, డాక్టర్ సునీత జోషి, జి.ప్రభాకర్, విద్యాసాగర్, పేరయ్య, డాక్టర్ బి.కుమార్, డాక్టర్ జి.గాయత్రీ దేవి, వి.స్వప్నిల్, చాంద్ బాషా, గౌస్, షౌకత్ హుస్సేన్, ఎం.రవీందర్, వివేకానంద రెడ్డి, బి.జ్యోతి, టివి.సరస్వతి, డాక్టర్ వి.సాయిబాబా, జిఎస్.చంద్రజ్యోతి, పూనం తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply