శాంతమ్మ సమర గాథ సీడి ఆవిష్క‌ర‌ణ

హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ :   బదనకల్ అమరుల 20వ వర్ధంతిని పురస్కరించుకొని అమరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంస్మరణ సభ జరిగింది. ఈ సభ ప్రారంభానికి ముందు అమరవీరులకు జోహార్లు చెబుతూ రెండు నిమిషాలు మౌనం పాటించడం, తదనంతరము సంస్మరణ సభకు హాజరైన వక్త‌లందరూ అభివాదం తెలియజేయడం జరిగింది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గానం చేసిన శాంతమ్మ సమర గాథ‌ ( శాంతి సమరయోధుల) పాటను బదనకల్ అమరుడు పెద్ది యాదగిరి ( రాజు ) తల్లి పెద్ధి పిచ్చమ్మ చేతుల మీదుగా సిడీని ఆవిష్కరణ చేయడం జరిగింది. అరుణోదయ కళాకారులు పాడిన లాల్ సలాం.. లాల్ సలాం అమరులకు లాల్ సలాం పాటతో సభను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ… నూతన మానవీయ సమాజంకై చాలా చిన్న వయసులో విప్లవోద్యమంలో కొనసాగుతూ ప్రాణాలు ఇస్తున్నారని వారి త్యాగాలను ఎత్తిపడుతూ ముందుకు సాగవలసిన అవసరం ఉందన్నారు. పాలకులు ఇవాళ పలానా తేదీలోపు మావోయిస్టులను చంపుతామనడం సరైనది కాదన్నారు. ఆయుధం పట్టిన వాళ్లే శాంతి చర్చలకు మేం సిద్ధమని అన్నప్పుడు ప్రభుత్వం కూడా చర్చలకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.

రిటైర్డ్ జ‌డ్జి చంద్రకుమార్ మాట్లాడుతూ… ముందుగా సభకు హాజరైన మిత్రులందరికీ విప్లవాభి వందనాలు తెలిపారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నామంటే వారు ఏ లక్ష్యం కోసం చనిపోయారు అనేది కూడా గుర్తుంచుకోవాలని గుర్తు చేశారు. 30 వేల పోలీస్ మిలటరీని కర్రెగుట్టలను, మధ్య భారతంలో చుట్టుముట్టి ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసులను, మావోయిస్టులను మానవ హననానికి పాల్పడుతున్నారని, ఆపరేషన్ కాగార్ ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.            అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రెండు తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ… ఈ దేశ వనరులు ఈ దేశ ప్రజలకే చెందాలన్నారు. పాలకులు నేడు వనరులను విధ్వంసం చేస్తున్నారన్నారు. కార్పొరేట్ శక్తులకు ఈ దేశ వనరులను కట్టబెట్టడానికి పాలకులు నేడు ఆదివాసులను, మావోయిస్టులైన ఈ దేశ పౌరులను హత్యలు చేస్తున్నారని ఇది దుర్మార్గమైన చర్య అన్నారు. దోపిడీ, పీడన, అసమానతలు ఉన్న దగ్గర, అణిచివేత ఉన్న దగ్గర ప్రతిఘటన ఉంటదని గుర్తు చేశారు.

ప్రొఫెస‌ర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ… 1969లో వెంగళరావు ప్రభుత్వం ఎన్ కౌంటర్ లు మొదలైనాయని అనాడే ఇది చట్టానికి వ్యతిరేకం అని చెప్పడం జరిగిందన్నారు. 2004లో ప్రభుత్వంతో నక్సలైట్లు చర్చలకు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం ముందుకు భూమి సమస్య, ఆదివాసుల సమస్య తదితర సమస్యలను ముందుకు తెచ్చినారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కట్టా భగవంత రెడ్డి మాట్లాడుతూ.. అమరవీరుల సంస్మరణ సభను జరుపుకోవడం అంటే అమరుల ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని అన్నారు. ఈ సంస్మరణ సభకు అమరుల స్మారక కమిటీ రాష్ట్ర కన్వీనర్ డేగల రమ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు మల్సూర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్, రైతు- కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమురయ్య, ఏఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం, రాష్ట్ర నాయకులు రాయమల్లు, యాకన్న, పీవోడ‌బ్ల్యూ ( స్త్రీ విముక్తి ) రాష్ట్ర కన్వీనర్ అరుణ, టిపిటిఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రకాష్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page