తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

హ‌న్మ‌కొండ, ఏప్రిల్ 3 ( అద్దం న్యూస్ ) : ఉద్యమంలో పాల్గొని వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలని, ప్రింటు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13వ తేదీన హైద‌రాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రుగ‌నున్న తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ రాష్ట్ర క‌మిటీ పిలుపునిచ్చింది. గురువారం హ‌న్మ‌కొండ జిల్లా కేంద్రం అంబేద్క‌ర్ సెంట‌ర్ వ‌ద్ద డిజిట‌ల్ మీడియా జ‌ర్న‌లిస్ట్ యూనియ‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎంపెల్లి ముత్తేష్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ జ‌ర్న‌లిస్టుల స‌మ్మేళ‌నానికి సంబంధించిన పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ బైరాగి, ఆలిండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రాజేంద్రప్రసాద్, బొడ్డు అశోక్, చార్వక, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు వేముల యాదగిరి, బాబన్న త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల పరిస్థితి నేడు ఆగమ్యగోచరంగా మారిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు వార్తలు రాసి ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులతో పాటు, ఉద్యమ వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, ఫోటో, వీడియో, డెస్క్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page