ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం తేదీని ప్రకటించాలి
– తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్
హైదరాబాద్, జూన్ 1, ( అద్దం న్యూస్ ) : టిజి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ తేదీని ఈ నెల 2వ తేదీ ( నేడు ) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మహా దీక్ష జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ… గత నెల మే 1వ తేదీ అన్ని యూనియన్ల అధ్యక్ష, కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమావేశమయ్యారన్నారు. ఆ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలా ? లేకపోతే యూనియన్ ఎన్నికలు నిర్వహించాల ? ఏది కావాలో ఆ నిర్ణయాన్ని ఎండికి తెలియచేయాలని సీఎం చెప్పారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అన్ని యూనియన్లు రాతపూర్వకంగా తెలియచేశారన్నారు. కానీ రవాణా శాఖ మంత్రి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ముందుగా ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పడంతో ఆర్టీసి ఉద్యోగాలు అయోమయానికి గురయ్యారని తెలిపారు. రవాణా శాఖ మంత్రి పున: పరిశీలించి ముందుగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, దానికి సంబంధించిన అపాయింటెడ్ తేదీని ఇవ్వాలని కోరారు. లేనిచో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతుందని హనుమంతు ముదిరాజ్ తెలిపారు.
మహా దీక్షకు ఆర్టీసీ సమాఖ్య నాయకులు రాజి రెడ్డి హాజరై మాట్లాడుతూ… ఈ నెల 2వ తేదీన వీలిన ప్రకటన చేయకుంటే తదుపరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యచరణ చేపడుతామని అన్నారు. టిజెఎంయు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వాములయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనయ్య, గోలి రవీందర్, రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ ప్రేమ్ నాథ్, రాష్ట్ర కార్యదర్శులు జీవన్ రామ్, నరేందర్, సంపత్ కుమార్, అతిఖ్ తదితరులు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వము తాత్సారం చేయకుండా వెంటనే అపాయింటెడ్ తేదీని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోనల్ ప్రెసిడెంట్ కృష్ణ, సిటీ రీజినల్ సెక్రెటరీ బుల్లెట్ పాండు, సికింద్రాబాద్ రీజినల్ సెక్రటరీ చెన్నయ్య, సమాఖ్య నాయకులు సాయి రెడ్డి, జకరయ్య, మహబూబ్నగర్ రీజినల్ సెక్రటరీ నాగేంద్ర గౌడ్, వివిధ డిపో అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply