రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం
– సీఎం రేవంత్రెడ్డి
ఖమ్మం, జూలై 10, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలోని రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆశీర్వాద సభా వేదికగా అశేషంగా తరలివచ్చిన రైతాంగాన్ని ఉద్దేశించి చెప్పారు. గడిచిన 9 రోజుల్లో రూ.9,000 కోట్ల మేరకు 73.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా చెల్లించిన సందర్భంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ నిర్వహించారు. సభా వేదికగా రైతు భరోసా చివరి విడతగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1009.15 కోట్ల నిధులను విడుదల చేయడంతో పాటు రైతులకు ఈ– పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేసే కార్యక్రమానికి సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల కోసం రూ. 3,504 కోట్లు విడుదల చేశారు. అలాగే, పలువురు రైతులకు ఈ-పట్టాదారు పాసుపుస్తకాలను అందించిన ముఖ్యమంత్రి ఆ కార్యక్రమాన్ని సభా వేదికగా లాంఛనంగా ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ… రైతులకు వ్యవసాయం పండుగ చేయాలని, రైతులు రాజును చేయాలన్న ఆలోచనతోనే గడిచిన 30 నెలల్లో 1 లక్ష 70 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగంపై ఖర్చు చేశామని చెప్పారు. రైతు భరోసా కింద గత ఏడాది జూన్లో 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేశామని గుర్తుచేశారు. 30 నెలల్లో రైతు భరోసా కింద 36,135 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని పెద్దలు చెప్పారని, రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే మా ఆశయమని అన్నారు. రైతు భరోసా, రుణ మాఫీ, బీమా, గిట్టుబాటు ధరలు, సన్నవడ్లకు బోనస్, ఉచిత కరెంట్, నష్టపరిహారం.. ఇలా రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం గడిచిన 30 నెలల్లో 1.70 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. సగటున ప్రతి నెలా రూ. 5,500 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటికి రాష్ట్రం రూ. 8.11 లక్షల కోట్ల మేరకు అప్పులు ఉండగా, ఎంతో సమయస్ఫూర్తితో రాష్ట్రాన్ని నడిపిస్తూ గత ప్రభుత్వ పథకాలతో పాటు అదనంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నీ కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను ఉదహరించారు. ఎకరాకు రూ. 12 వేలకు పెంచి రైతు భరోసా అందిస్తున్నామన్నారు. 30 నెలల్లో రూ. 80 వేల కోట్ల మేరకు వడ్లను కొనుగోలు చేశామన్నారు. గత ప్రభుత్వ పథకాలతో పాటు అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు జారీ, సన్నబియ్యం పంపిణీ, 7 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, మహిళా సంఘాలకు వెయ్యి బస్సులు అందించడం, బ్యాంకుల లింకేజీతో 60 వేల కోట్ల మేరకు రుణాలు అందించడం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు పండుగ సారెగా ఇందిరమ్మ చీరలు అందించడంతో పాటు ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగా 67,717 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి అనేక అంశాలను వివరించారు. వచ్చే శాసనసభ ఎన్నికల 2029 మే, జూన్ లో జరుగుతాయని అంచనా వేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు, శాసనసభ స్థానాలు 119 నుంచి 182 కు పెరుగుతాయని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో మంత్రిమండలి సభ్యులు అందరూ రోజుకు 18 గంటలు పనిచేస్తారని, తెలంగాణలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు, వెనుబడిన వర్గాలు, మహిళలు, రైతులు, విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా నిలబెడుతామని చెప్పారు.![]()
