అంబర్పేట, నవంబర్ 22, అద్దం న్యూస్ : ఐదు నెలల క్రితం పెద్ద కూతురు చనిపోవడంతో అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురైన దంపతులు తమ చిన్ని కూతురితో కలిసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాగ్ అంబర్పేట రామకృష్ణనగర్లో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. బాగ్ అంబర్పేట రామకృష్ణనగర్లో నివసించే శ్రీనివాస్ ( 45 )కు భార్య విజయలక్ష్మీ ( 42 ), కుమార్తెలు కావ్య, శ్రావ్య ( 15 )లు. వీరు గతంలో రాంనగర్లో నివసించేవారు. శ్రీనివాస్ ఎల్ఐసిలో సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. వీరు రాంనగర్లో ఉన్న సమయంలోనే గత ఐదు నెలల క్రితం పెద్ద కూతురు కావ్య ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది. నెలన్నర క్రితమే శ్రీనివాస్, భార్య విజయలక్ష్మీ, చిన్న కూతురు శ్రావ్య లు బాగ్ అంబర్పేట రామకృష్ణనగర్లో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఇదిలా ఉండగా తమ పెద్ద కూతురు కావ్య మృతిని తట్టుకోలేక గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్థాపం చెందుతున్నారు. బంధువులతో కూడా మాట్లాడకుండా దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా శ్రీనివాస్ అక్క సువర్ణ శనివారం తమ్ముడికి చూసేందుకు రామకృష్ణనగర్లోని ఇంటికి వచ్చింది. తలుపు లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపు తీయాల్సిందిగా పిలిచింది. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో పాటు ఇంట్లో నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం తెలుసుకున్న కాచిగూడ ఏసిపి హరీష్ కుమార్, డిఐ హఫీజుద్దీన్, ఎస్ఐ సురేష్ లు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానం రావడంతో తలుపులను పగులగొట్టారు. ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంటి ప్రధాన ధ్వారం వెంటిలేటర్కు శ్రీనివాస్ ఉరి వేసుకుని ఉండగా, అతని భార్య విజయలక్ష్మీ, కూతురు శ్రావ్య మరో గదిలోని కిటికి ఇనుప చువ్వలకు చీరలతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాలను చూడగా వారు రెండు రోజుల క్రితమే చనిపోయారని పోలీసులు భావించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దేవుడు పిలుస్తున్నాడని …
తమ పెద్ద కూతురు కావ్య చనిపోయినప్పటి నుంచి శ్రీనివాస్, అతని భార్య విజయలక్ష్మీ, చిన్న కూతురు శ్రావ్య లు తీవ్ర వేదనతో ఉంటున్నారు. దేవుడు తమను పిలుస్తున్నాడని పదే పదే అనేవారని స్థానికులు చెబుతున్నారు. ఆత్మహత్యకు గల కారణం ఆర్థిక ఇబ్బందులా, లేదా పెద్ద కూతురు చనిపోయిందనే బెంగతో ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.














Leave a Reply