పిల్లల అక్రమ రవాణాను నిర్మూలించడానికి ఆపరేషన్ ముస్కాన్ కింద స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నాం
– తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి

హైదరాబాద్, జులై 30, అద్దం న్యూస్ : పిల్లల అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరముందని, అందుకోసం ఆపరేషన్ ముస్కాన్ కింద నెలవారీ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం బేగంపేటలోని హెరిటేజ్ ప్లాజాలో పోలీస్ శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అక్రమ రవాణాను ఎదుర్కోవడంపై రాష్ట్ర సంప్రదింపుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ, రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ ( ఎస్సిపిసిఆర్ ), బాలల సంక్షేమం ( సిడబ్ల్యుఓ ) అధికారులు, డిసిపి లు, అనేక ప్రభుత్వేతర సంస్థలు పాల్గొన్నాయి. ఈ మానవ అక్రమ రవాణా అవగాహన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ( ఎస్సిపిసిఆర్ ) ఛైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు అపర్ణ, వందన, చందన, సరిత, ప్రేమలత అగర్వాల్, వచన్ కుమార్, టిజిఎస్ఎల్ఎస్ఎ రాష్ట్ర సభ్య కార్యదర్శి పంచాక్షరి, అసోసియేషన్ ఆఫ్ వాలంటరీ యాక్షన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనుంజయ్ ఇన్వర్, మహిళా భద్రతా విభాగం డిఐజి రీమా రాజేశ్వరి, ఎన్జిఓ ప్రతినిధి సునీత, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ… మానవ అక్రమ రవాణాలో అవయవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల దుర్వినియోగం, లైంగిక దోపిడీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిడబ్ల్యుఓ, పోలీసు శాఖ, ఎస్సిపిసిఆర్, ఎన్జిఓ ల మధ్య సహకార ప్రయత్నాలు అవసరమని ఆమె పిలుపునిచ్చారు. వారానికి ఒక రోజు పిల్లల కేసుల కోసం ప్రత్యేకంగా కోర్టులో కేటాయించాలని న్యాయవ్యవస్థకు సూచించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply