బిసిలకు అన్యాయం చేయడమే మీ నైజమా
బిసిల ఆత్మ గౌరవ, ధర్మ పోరాట ప్రదర్శనలో విరుచుకుపడ్డ బిసి జేఏసి ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య
42 శాతం బిసి రిజర్వేషన్ల అమలుకు – ఆత్మగౌరవ – ధర్మపోరాట ర్యాలీలో గర్జించిన బిసిలు
రిజర్వేషన్ల కేటాయింపులలో – తప్పులు జరిగాయన్న బిసి కమిషన్ మాటను వినరా ?
బిసిలకు అన్యాయం చేస్తూనే – మేమే రోల్ మోడల్ అని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గు చేటు
చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని– న్యూ ఢిల్లీ తీసుకొని వెళ్లి ప్రధానమంత్రిని కలపండి
తప్పులు అన్ని మీ దగ్గర పెట్టుకొని – కేంద్రాన్ని విమర్శించడం బట్టకాల్చి మీద వేయడం కాదా ?
రిజర్వేషన్ల సాధనకు న్యూ డిల్లీ ఏఐసిసి ఆఫీసు ముందు ధర్నా చేపడతాం
42 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత రాహుల్ గాంధీదే
హైదరాబాద్, డిసెంబర్ 1, అద్దం న్యూస్ : బిసి రిజర్వేషన్లలను తగ్గించి మోసం చేస్తూనే, మా ప్రభుత్వం దేశానికీ ఆదర్శం అని చెప్పుకోవడం సిగ్గు చేటు, నయవంచన అని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బిసి సంక్షేమ సంఘ అధ్యక్షుడు, బిసి జేఏసి ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఒక వైపు బిసి రిజర్వేషన్లల కేటాయింపులలో అవకతవకలు జరిగాయని, రిజర్వేషన్ల శాతం తగ్గిందని, అందుకే వెంటనే ఎన్నికలు వాయిదా వేసి సరిదిద్దాలని రాష్ట్ర బిసి కమిషన్ తెలిపినప్పటికీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరించడం అప్రజాస్వామికం అని అన్నారు. ఇది రేవంత్ ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనం అని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ నుంచి ట్యాంక్బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు బిసిల ఆత్మగౌరవ – ధర్మ పోరాట ర్యాలీని భారీ ఎత్తున్న నిర్వహించారు. ఈ ర్యాలీలో సంఘిభావంగా బిఆర్ఎస్ పార్టీ శాసనమండలి పక్ష నాయకుడు సిరికొండ మధుసూధనా చారి, రాష్ట్ర బిసి కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్.వకుళాభరణం కృష్ణమోహన్ రావు, బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, బిసి సంక్షేమ సంఘం జాతీయ కో–ఆర్డినేటర్ ర్యాగ రిషి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనకు పెద్ద ఎత్తున తరలివచ్చిన బిసి. కుల, విద్యార్ధి, మహిళా, యువజన, ఉద్యోగ సంఘాలు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులూ పాల్గొన్నారు. ఈ ప్రదర్శనకు బిసి యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బిసి విద్యార్ధి సంఘ రాష్ట్ర కన్వీనర్ మోడీ రాందేవ్ లు నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ ప్రభుత్వం వెంటనే ఎన్నికలను వాయిదావేసి, 42 శాతం బిసి రిజర్వేషన్ల అమలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం బిసిల ఆత్మగౌరవానికి, మనోభావాలకు భంగం కలిగిస్తూ, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది బిసిలకు మోసం, దగా, నయవంచన చేయడమేనని ఆయన విమర్శించారు. ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పలు దేశాలలో ఏం జరిగిందో రేవంత్ ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలని కృష్ణయ్య హితవు పలికారు. మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు అన్ని అనుమాదాస్పదంగా ఉన్నాయన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత అఖిలపక్షాన్ని ప్రధానమంత్రిని కలవడానికి తీసుకు వెళ్ళలేదన్నారు. లోక్ సభలో ఇండియా కూటమికి 236 మంది ఎంపీలు ఉన్నారని, గత పార్లమెంటు సమావేశాలు బీహార్ ఓటర్ల విషయంలో నెల రోజులు పార్లమెంట్ బహిష్కరించారు… కానీ బీసీల విషయంలో ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదు… బహిష్కరించలేదు కనీసం మాట్లాడలేదు… పోనీ కనీసం చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు బిల్లు ఎందుకు పెట్టలేదన్నారు. ప్రతి దశలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదని తేట తెల్లం అవుతుందని కృష్ణయ్య అన్నారు. సిరికొండ మధుసూధనా చారి మాట్లాడుతూ….42 శాతం రిజర్వేషన్ల ఉద్యమానికి పూర్తి మద్దతును ప్రకటించారని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని, 42 శాతం అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బిసి కమిషన్ మాజీ ఛైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ…. చట్టసభలను, హైకోర్టును, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, రేవంత్ ప్రభుత్వం నియంతృత్వ వైఖరితో పాలన కొనసాగిస్తున్నదని ఆరోపించారు. ప్రజాపాలన కొనసాగిస్తున్నామని గొప్పలు చెప్పుకునే రాష్ట్రప్రభుత్వం మెజారిటీ బిసి వర్గాల ప్రయోజనాలను కాలరాయడమే ప్రజారంజకమా ? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన సిపెక్ సర్వేతో బిసి రిజర్వేషన్ల శాతం తగ్గిందన్నారు.
బిసి సంక్షేమ సంఘం జాతీయ కో–ఆర్డినేటర్ డాక్టర్.ర్యాగ రుషి అరుణ్కుమార్ మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాల్సిందిపోయి రహస్య ఎజెండాలతో కీడుచేసే పనులను చేపడుతున్నదని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, అందుకు అనుగుణంగా పాలన కొనసాగించడం.. కానీ రేవంత్ ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తుందని ఆయన విమర్శించారు. ఈ భారీ ప్రదర్శనలో బిసి సంక్షేమ సంఘం నాయకులు నీల వెంకటేష్, గుజ్జ సత్యం, అనంతయ్య, బాణాల అజయ్, భీం రాజ్, రాజ్ కుమార్, వేణుమాధవ్, ఆశిష్ గౌడ్, నిఖిల్ పటేల్, బాల స్వామి తదితరులు పాల్గొన్నారు.


https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply