కెడి.రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డిల అవినీతి అక్రమాల పై సమగ్ర విచారణ జరిపించాలి
– సమావేశంలో వక్తల డిమాండ్

సోమాజిగూడ, సెప్టెంబర్ 25, అద్దం న్యూస్ : కెడి.రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డి అవినీతి అక్రమాల పై సమగ్ర విచారణ జరిపించి, తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, ఈ నెల 28 న జరిగే ఎన్నికలను వాయిదా వేయాలని వక్తలు డిమాండ్ చేశారు. గురువారం తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్, తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) గౌరవాధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లారా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ బైరాగి, తెలంగాణ విటల్, పృధ్విరాజ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నకిలీ బోగస్ సభ్యత్వాలను గుర్తించి వాటిని రద్దు చేయాలని, నకిలీ సభ్యత్వాల ఆధారంగా చిత్రపురి హౌసింగ్ సొసైటీలో ఇచ్చిన ఇండ్లను తిరిగి వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వల్లభనేని అనిల్, కేడి రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డి సాగిస్తున్న లక్షల, కోట్ల రూపాయల దందాను ఆపాలని డిమాండ్ చేశారు, డబ్బు బలంతో.. అధికార బలంతో ఇదే పద్ధతిని కొనసాగిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని వారు హెచ్చరించారు.
ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేయడం, తప్పుడు కేసులు నమోదు చేస్తే ఆ ముగ్గురు వ్యక్తులే బాధ్యత వహించాలన్నారు. సినిమా రంగంలో తెలంగాణ ఆర్టిస్టులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని వారు తీవ్రంగా హెచ్చరించారు. తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల అంశంలో ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న కెడి.రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డిల పద్ధతి మార్చుకోవాలని, వారు చేసిన అవినీతి అక్రమాల పై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఈ సమావేశంలో తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ నాయకులు ఉజ్జయిని శంకర్, గోవింద్ రాజు, కస్తూరి శ్రీనివాస్, భద్ర, ధనరాజ్, బాలు నాయక్, నర్సింగ్, పి.రాకేష్, సంతోష్, స్వామి, బాలు, నర్సింగస్వామి, తుల్జా రెడ్డి, గోసికే రవి, సాగర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply