ప్రభుత్వ హాస్టళ్ళల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను అరికట్టేందుకు విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలి
– సీపీఐ ( ఎం ) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
హైదరాబాద్, డిసెంబర్ 14, అద్దం న్యూస్ : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ హాస్టళ్ళల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతమవుతున్నందున వీటిని అరికట్టేందుకు ఒక విచారణ కమిషన్ను ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీపీఐ ( ఎం ) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల బాలికల హాస్టల్లో పెరుగు, కుళ్ళిన కూరగాయల ఆహారాన్ని డిసెంబర్ 12 న తిని 26 మంది విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతతకు గురై కింగ్కోఠి, నీలోఫర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, హైదరాబాదు సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అశోక్రెడ్డి కలిసి కింగ్కోఠిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను, డాక్టర్లను విద్యార్థినీల ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ ( ఎం ) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ… రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల్లో ఉప్మా రవ్వ, పులిసిపోయిన పెరుగు, కుళ్ళిపోయిన కూరగాయలు, నాసిరకం పప్పులు, ముక్కిపోయిన బియ్యం పెట్టడం వల్లనే ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు పదే పదే జరుగుతున్నాయన్నారు. జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్లో మరియు మాదాపూర్ ప్రమరీ స్కూల్లో జరిగిన ఘటనల వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురై కోలుకోకముందే, బాగ్లింగంపల్లి ఘటన జరగడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నదన్నారు. హాస్టళ్ళ నిర్వహణలోపం, పర్యవేక్షణ కొతర, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, పరిశుభ్రత లోపం, కలుషిత నీరు తదితర కారణాల వల్లనే ఈ ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఘటన బయటకు రాకుండా ప్రిన్సిపాల్ ప్రయత్నించడం ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని తెలియజేస్తున్నదన్నారు.
ఈ ఘటనపై గతంలో హ్యుమన్రైట్స్ కమిషన్ తీవ్రంగా స్పంధించినప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ఆర్థిక భారం కూడా ఈ ఘటనకు ఒక ముఖ్య కారణమైందున ప్రభుత్వ హాస్టల్స్కు చెల్లించాల్సిన బిల్లులను పూర్తిగా చెల్లించాలని, ఘటనలకు కారణమవుతున్న అధికారులపై, కాంట్రాక్టు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పర్యవేక్షణ లోపాలను సరిదిద్ధి, ఆహార భద్రత ప్రోటోకాల్స్ను పకడ్బందీగా అమలు చేయాలని, ఆహారం వండడానికి సర్టిఫైడ్, శిక్షణ పొందిన కుక్లను మాత్రమే నియమించాలని, వీటి కోసం తక్షణమే కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.














Leave a Reply