హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : ప్రభుత్వ పెన్షనర్ల గోస తగిలే బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిందని మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీత మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ మహిళ విభాగం ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సునీత మహేందర్ రెడ్డి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం శేరిలింగంపల్లి, గోపన్నపల్లిలో ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన భూమిని బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక లాక్కుందని విమర్శించారు. హెల్త్ కార్డులు లేక పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీని ఇచ్చారు. మహిళలకు నేటి సమాజంలో రక్షణ కరువైందని మహిళలపై దాడులు జరిపితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కఠినాతి కఠినంగా శిక్షించాలన్నారు. వృధ్యాప్యంలో పిల్లలు పట్టించుకోక, సర్వీస్ చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోతే తాము ఎలా బ్రతకాలని అన్నారు. హెల్త్ కార్డులు ఇవ్వడం వల్ల ప్రభుత్వం పై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని … తమ బేసిక్ పే నుండి ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేసుకోవచ్చునని తెలిపారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉమెన్ పెన్షనర్స్ ఫోరమ్ చైర్ పర్సన్ ఉమాదేవి మాట్లాడుతూ.. 40 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందించిన పెన్షనర్లు, సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా మహిళ దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన పెన్షనర్లకు సునీత మహేందర్ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమురెల్లి, ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షులు వేణుగోపాల్, ట్రెజరర్ ప్రకాష్ రావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ లక్ష్మణరావు, మహిళా విభాగం చైర్ పర్సన్ సూర్య కళ, కోఆర్డినేటర్ ఝాన్సీ రాణి, కన్వీనర్ కటకం జానకి, కో-చైర్ పర్సన్ స్వర్ణ కుమారి, కన్వీనర్ శ్రీదేవి, కో-కన్వీనర్ రుద్రమ్మ, ఈసీ మెంబర్లు దీన, లక్ష్మీస్వరి, చంద్రకళ, రాజేశ్వరి, సరోజ తదితరులు పాల్గొన్నారు.












Leave a Reply