అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం
– అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని టిడిపి తమ్ముళ్ల డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 1, అద్దం న్యూస్ : ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను టిడిపి నాయకులు దహనం చేశారు. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాయకులు నల్లెల్ల కిషోర్, బాల్రాజ్ గౌడ్ల ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అశోక్నగర్ ప్రధాన రోడ్డు మార్గంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ, నిప్పు పెట్టి దహనం చేసి తమ నిరసనను తెలియచేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, బాల్రాజ్ గౌడ్ లు మాట్లాడుతూ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అహంకారపూరిత, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ద్వారా సుమారు 250 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని, ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అంబటి రాంబాబు ‘డైవర్షన్ పాలిటిక్స్’ కు పాల్పడుతున్నారని విమర్శించారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదం తయారీలో ఆవు నెయ్యి బదులు 68 లక్షల కేజీల కల్తీ కెమికల్ నెయ్యి వాడారని, ఇందులో 36 మంది భాగస్వామ్యమున్నట్లు సిట్ రిపోర్ట్ స్పష్టం చేసినా, ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు.
ఒక నిబద్ధత కలిగిన నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం అంటే రాష్ట్ర ప్రజలందరినీ అవమానించడమేనని ధ్వజమెత్తారు. తప్పును ఎత్తిచూపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రౌడీయిజంతో తొలగించడమే కాకుండా, సభ్య సమాజం తలదించుకునేలా బూతులతో రెచ్చిపోవడం అంబటి అహంకారానికి నిదర్శనమని అన్నారు. మాజీ మంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన అంబటి బజారు రౌడీలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికే హానికరమని నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి, పోలీసులు ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని, న్యాయస్థానం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరశురామ్, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, భాను ప్రకాష్, కరణం కిరణ్, శ్యామ్ సుందర్, తడక వినోద్, అనిల్ కురుమ, వంశీ కృష్ణ, చంద్రమోహన్ గౌడ్, ఎస్.ప్రకాష్, కొమురయ్య, భవానీ శ్రీనివాస్, పి.వీరబాబు, అమ్మి నాయుడు, భిక్షపతి చారి, సత్యనారాయణ, అహ్మద్ అలీ, శక్తి ప్రేమ్, రవి గౌడ్ పాటు సికింద్రాబాద్ నియోజకవర్గ టిడిపి శ్రేణులు, ఇతర ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















Leave a Reply