...

కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష

 

కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :    హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్‌వర్క్ ద్వారా కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ‌నివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, పీసీసీఎఫ్ ఆర్ఎం.డోబ్రియల్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ( హెచ్‌సియు ) భూములను లాక్కున్నట్లుగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు (Fake Videos), ఫొటోలు (Fake Photos) కరోనా వైరస్‌ను మించిన మహమ్మారిలాంటివని స‌మావేశం అభిప్రాయ‌ప‌డింది. సోషల్ మీడియా నెట్‌వర్క్ ద్వారా కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 లో ఉన్న భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని.. ఐఎస్‌బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డింగ్‌లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ భవనాలను నిర్మించారని.. వాటిని నిర్మించే సందర్భాల్లో ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్‌లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందని అంశంపై సమావేశంలో చర్చ జరిగింది.

అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని అధికారులు వివరించారు. వాస్తవాలు వెల్లడించే లోగా అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావటం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్లోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు సమావేశంలో వివరించారు. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా ఠండన్ లాంటి వారందరూ ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోల పోస్టు చేసి సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారన్న చర్చ సమావేశంలో జరిగింది. ఈ భూములపై మొట్టమొదటగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ ఝా కొద్ది సేపట్లోనే తన పోస్టును తొలిగించి క్షమాపణలు చెప్పారని, కానీ మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు వివరించారు. కంచ గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఇదే తరహాలో ఇండో పాక్, ఇండో చైనా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తుల్లో యుద్ధాలు జరిగే పెను ప్రమాదముంటుందని చర్చ జరిగింది. వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు కూడా వాటినే నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందని అధికారులు అన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు. ఏఐ ఫేక్ కంటెంట్‌ను గుర్తించడానికి అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను సమకూర్చుకోవాలని సీఎం రేవంత్‌ అధికారులకు సూచించారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.