హైదరాబాద్, అద్దం న్యూస్ : తాగునీటి సమస్య పై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులేదని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. బుధవారం నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… నగర శివారు ప్రాంతాలలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, మంచినీటి కొరతను తీర్చాలంటూ గతంలో ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. మంచి నీటి కొరత సమస్య రాను రాను తీవ్రరూపం దాల్చి, భూగర్భ జలాలు అడుగంటి పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అసలు ప్రజా సమస్యలపై ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుందన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు వస్తారా అని, ఎప్పుడూ ఎవరో ఒకరి దయా.. బిక్ష మీద బతకాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఇది ఇలా ఉంటే “గోరు చుట్టుపై రోకలి ఫోటు” అన్న చందంగా ఇటీవల ఎత్తుగా ఉన్న ప్రాంతాలకు ప్రెషర్ లేక మంచినీరు అందడం కష్టంగా మారడంతో వాళ్లు మోటార్లతో నీటిని పట్టుకోవడం జరుగుతుందన్నారు. అయితే ఆ మోటర్లన్నింటినీ సీజ్ చేసి తమ ఇష్టారాజ్యంగా అపరాధ రుసుము విధిస్తున్నారన్నారు. అసలు మీరు మంచినీటి సరఫరా సరిగా చేస్తే వారికి మోటర్లు పెట్టే అవసరమే లేదుకదా అని ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ముందు చూపుతో కృష్ణా జలాలను నగరానికి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. మంచినీటి ఎద్దడి ఎక్కువవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం మెప్పు కొరకు ఢిల్లీ చుట్టూ తిరగడానికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సరిపోతుందని, మంత్రులు ఎంత సేపు తమ పదవులు కాపాడుకోనే ప్రయత్నాలకే సమయం అయి పోతుందన్నారు. ముంచుకొస్తున్న మరో సమస్య ఏమిటంటే కరెంటు కోత సమస్య. అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చిన్నపరిశ్రమల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఆరు హామీలు (సూపర్ సిక్స్), అమలు చేశామని ప్రజలను మభ్యపెడుతున్నారని, గొప్పలు చెప్పుకోవడం కాంగ్రెస్ పాలకులకే చెల్లిందనన్నారు. కానీ ఒక్క పథకం కూడా అమలకు నోచుకోలేదన్నారు.
రుణమాఫీ ఎవరికి ఇచ్చారో. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని, గంటకు ఒక బస్సు కూడా రావడం లేదని మండిపడ్డారు. అమలుకు నోచుకోని హామీలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమం పట్ల దృష్టి పెట్టాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని రేపు మాపు అంటూ సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. అదే విధంగా కొత్త రేషను కార్డుల జారీ ప్రక్రియ అటకెక్కించారని, ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. గ్రామసభల పేరుతో ఇందిరమ్మ ఇల్లు, ఇతర పథకాలు తమ పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇటువంటి జిమ్మిక్కుల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని, చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కారం చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, నాయకులు ఎస్.ప్రకాష్, భానుప్రకాష్, సత్యనారాయణ సుక్రవేది, కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply