బూటకపు ఎన్‌కౌంటర్లను ఆపాలి – ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి – సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ

హైదరాబాద్, న‌వంబ‌ర్ 19, అద్దం న్యూస్ :    బూటకపు ఎన్‌కౌంటర్లను ఆపాలని, అరెస్టు చేసిన మావోయిస్టులను కోర్టుల్లో హాజరుపర్చాల‌ని, ఎన్‌కౌంటర్ల పై న్యాయ విచారణ జరపాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ కోరారు. ఈ మేర‌కు బుధ‌వారం సిపిఎం రాష్ట్ర కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి ఏజెన్సీలో నిన్న మావోయిస్టు అగ్రనాయకులు హిడ్మాతో, పాటు ఆయన భార్య, అలాగే ఆరుగురు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారన్నారు. అదే ప్రాంతంలో బుధ‌వారం మరో ఎన్‌కౌంటర్‌ జరిగిందని, ఏడుగురు మావోయిస్టు నాయకులు చనిపోయారని, అందులో అగ్ర నాయకులు దేవ్‌జీ, ఆజాద్‌ కూడా ఉన్నారనే వార్తలొస్తున్నాయన్నారు. ఈ ఎన్‌కౌంటర్లన్నీ మావోయిస్టులను అరెస్ట్‌ చేసి, నిర్బంధించి, బూటకపు ఎన్‌కౌంట‌ర్ల‌కు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్లను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ, ఈ ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మావోయిస్టులు కాల్పులు విరమించి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని పలుమార్లు ప్రకటించినప్పటికీ, వాళ్ళతో చర్చలు జరపకుండా మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూనుకుంటున్నదని విమ‌ర్శించారు. సానుభూతిపరులను, అమాయక గిరిజనులను కూడా అరెస్టులు చేసి వేధింపులకు, చిత్రహింసలకు గురి చేస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయన్నారు. అదే విధంగా విజయవాడ తదితర ప్రాంతాల్లో 50 మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేసారని, ఇంకా కొంత మందిని నిర్బంధించారనే వార్తలు వస్తున్నాయని, అరెస్టు చేసినవాళ్ళందరినీ కూడా వెంటనే కోర్టు ముందు హాజరు పరచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.



https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page