కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయానికి నిదర్శనం
– ఎన్టీఏను రద్దు చేసి రాష్ట్రాలకే ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించాలి
– వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాచిగూడ నుండి బర్కత్పురా సిగ్నల్ వరకు విజయోత్సవ ర్యాలీ
హైదరాబాద్, జూలై 27, ( అద్దం న్యూస్ ) : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావడం దేశ వ్యాప్తంగా విద్యార్థులు, యువత ఐక్యంగా సాగించిన ఉద్యమ విజయానికి నిదర్శనమని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి, యువతకు జేజేలు తెలుపుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ కాచిగూడ నుండి బర్కత్పురా సిగ్నల్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అశోక్ రెడ్డి అధ్యక్షత వహించిన ముగింపు సభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పుట్టా లక్ష్మణ్, మణికంఠ రెడ్డి, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్, ఏఐడీఎస్ఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నితీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, సీబీఎస్ఈ మూల్యాంకనంలో జరిగిన వైఫల్యాలు, సీయూఈటీ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ చేసిన తప్పిదాలు, విద్య కేంద్రీకరణ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధంతో అణచివేయాలని ప్రయత్నించిందని విమర్శించారు.

ఢిల్లీ పార్లమెంట్ మార్చ్ సందర్భంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగాలు, పెల్లెట్ దాడులు వంటి దమనకాండకు పాల్పడిందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే పోరాటం ముగియలేదని, దేశ విద్యా వ్యవస్థను కాపాడేందుకు విద్య కేంద్రీకరణ విధానాలను పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు, ఎన్టీఏను రద్దు చేసే వరకు, జాతీయ విద్యా విధానం ( NEP-2020 ) ను ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి.జావేద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్, జూనుగరి రమేష్, హైదరాబాద్ జిల్లా నాయకుడు నాగేంద్ర, కైలాష్ ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గ్యార నరేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు అనిల్, హరీష్ ఏఐడీఎస్ఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజు, పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు శ్రీను, అశ్విని తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply